తుఫాను తగ్గేవరకు నాట్లు వేయ వద్దు
గిరి రైతులకు సూచించిన వ్యవసాయ సహాయ సంచాలకురాలు జాహ్నవి
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలలో అవసరానికి మించిన నీటిని వెంటనే తొలగించాలని, అదే క్రమంలో తుఫాను ప్రభావం తగ్గే వరకు నాట్లు వేయడాన్ని నిలిపివేయాలని వ్యవసాయ సహాయ సంచాలకురాలు కే జాహ్నవి అన్నారు. మండల వ్యవసాయ అధికారి బి శ్రీనివాసరావు తో కలిసి మండలంలోని పలు పంచాయతీలలో ఆమె సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పెద బరడ, గొంది పాకల, చౌడుపల్లి పంచాయతీలతోపాటు చిన్నగెడ్డ గ్రామంలో రైతులను కలసి పంట పొలాల పరిస్థితులపై ఆరా తీశారు. తుఫాను ప్రభావం వలన ఎక్కడ, ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. అదే క్రమంలో అల్పపీడన ద్రోణి కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పొలాలలో పనులకు వెళ్ళవద్దని సూచించారు. రాబోవు రెండు మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు గిరి రైతులు పాల్గొన్నారు.