జనసేన పార్టీ అల్లూరి జిల్లా కార్యదర్శి సీతారామ్
లోతుగెడ్డ జంక్షన్ లో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
కూలిన గృహాలు, పరామర్శించిన కూటమి నాయకులు. సీతారాం, సత్యవతి, రమణ
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- అల్పపీడన ప్రభావంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతుగెడ్డ జంక్షన్లో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా పాత మురుగు నీటి కాలువలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతుంది. స్థానిక గ్రామస్తులు పిండి రామలక్ష్మి నివాస గృహం వర్షాల కారణంగా కూలిపోయింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ మరికొన్ని నివాస గృహాలు ఇదే పరిస్థితిలో వుండడంతో భయాందోళనలకు గురవుతున్నారని ఎన్డీఏ కూటమి నాయకులు ఉల్లి సీతారాం, నంబారి సత్యవతి, రమణ లతోపాటు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వారు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమస్యలను పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, తుపాన్ తగ్గే వరకు సురక్షిత ప్రదేశాలలో ఉండాలని సూచించారు. ఇటువంటి పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయని, ఉన్నతాధికారులు తక్షణమే నివేదికలు సిద్ధం చేసి బాధితులను అన్ని విధాల ఆదుకోవాలని వారు కోరారు.