అజయ్ మోహన్ సింగ్ బిష్త్ అంటే గుర్తు పట్టేవారు తక్కువ మందే. కానీ యోగీ ఆదిత్యనాథ్ అంటే అందరూ గుర్తు పడ్తారు. ముఖ్యమంత్రుల్లో కెల్లా మేటి అని పొగిడేవారూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లో వరసగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆయన ఒక్కరే. ఏడేళ్ల పై నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో యోగీ మీద సొంత పార్టీలోనే కాదు, ఉపముఖ్య మంత్రులు సైతం ఫిర్యాదు చేస్తున్నారు. కేంద్రమంత్రి అనుప్రియ పటేల్, సంజయ్ నిషాద్ కూడా తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు ముఖ్యమంత్రి పదవిమీద ఆశ ఉండడం అర్థం చేసుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి దినేశ్శర్మ కూడా మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు. ఈ రకంగా వారు నిరసన తెలియజేశారు. యోగీ ఆదిత్యనాథ్ ఆర్.ఎస్.ఎస్. కుదురు నుంచి రాకపోయినా మోదీకన్నా పెద్ద హిందుత్వవాదిని అని చెప్పుకోవడానికి అమితంగా ప్రయత్నించారు. యు.పి.లో ఉండాలంటే యోగి యోగి అనాల్సిందేనని ఆయన వందిమాగధులు నినదిస్తూ ఉంటారు. యోగీ చుట్టూ చేరి భజన చేసేవారు ఎంతమంది ఉంటారో వ్యతిరేకించేవారూ అంతేమంది ఉంటారు. మెరుగైన ముఖ్యమంత్రి అన్న భ్రమ చాలామందిలో ఉన్నందువల్ల యోగీ ఆదిత్యనాథ్లో అహంభావం తారస్థాయికి చేరింది. లోకసభ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయానికి కారణాలను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో యోగీ మోదీ-అమిత్ షా మీద యోగి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘‘మోదీలో అహంకారం పెరిగిపోవడమే ఓటమికి కారణం’’ అన్న అర్థమొచ్చే మాటలు కూడా మాట్లాడారు. యోగీ అహంకారం ఎక్కువో, మోదీ అహంకారం ఎక్కువో తేలాల్సి ఉంది. యోగీ ఆదిత్యనాథ్ 2017 మార్చిలో ముఖ్యమంత్రి కావడమే ఆశ్చర్యం. ఎందుకంటే ఆయన ఎంత కరడుగట్టిన హిందుత్వవాది అయినా ఆర్.ఎస్.ఎస్. కుదురునుంచి వచ్చినవారు కాదు. ముఖ్యమంత్రి కాక ముందు బీజేపీతో ఆయనకు చెప్పుకోదగ్గ సాన్నిహిత్యమూ లేదు. మొదటి సారి 26వ ఏట గోరఖ్పూర్ నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై వరసగా గెలుస్తూ 2017 దాకా కొనసాగారు. 2017 ఎన్నికలలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల రంగంలోకి దిగింది. మోదీ-షా ద్వయం అమాంతం యోగీ ఆదిత్యనాథ్ను ముఖ్యమంత్రి స్థానంలో ప్రతిష్ఠించింది.
ఆర్.ఎస్.ఎస్. కుదురుకు చెందినవారు కాకపోవడంవల్లనేమో యోగీ అధిష్ఠానం ఆజ్ఞలను తు.చ. తప్పకుండా అమలుచేసే స్వభావం ఉన్నవారు కాదు. ముఖ్యమంత్రి అయిన దగ్గరనుంచి ఆయన దాదాపు నిరంకుశంగానే ప్రవర్తిస్తున్నారు. బీజేపీ శాసనసభ్యులను కూడా ఖాతరు చేయరు. ఇక కార్యకర్తలకు ఆయన దర్శనభాగ్యం లభించడమే దుర్లభం. ఆయన నిరంకుశ స్వభావం 2021లో కరోనా పంజా విసిరినప్పుడు స్పష్టమైంది. యోగీ ఆదిత్యనాథ్ ఒంటెత్తుపోకడ అనుసరించారు. గంగానదిలో కరోనా మృతుల శవాలు తేలియాడినా, ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత ఉన్నా, ప్రభుత్వ నిర్వాకంపై దుమారంరేగినా యోగి అత్మస్తుతిలోనే మునిగి పోయారు. యోగీ అధికారవర్గం మీదే ఎక్కువ ఆధారపడతారు. యోగీలో ఉన్న ఈ అహంభావ ధోరణిని కనిపెట్టిన మోదీ గుజరాత్లో ఐ.ఎ.ఎస్. అధికారిగా పనిచేసిన అరవింద్ కుమార్ శర్మతో రాజీనామా చేయించి ఉత్తరప్రదేశ్కు పంపించారు. శర్మను ఉపముఖ్యమంత్రిని చేయాలన్నది మోదీ ఆలోచన. కానీ చాలా రోజులు యోగీ సదరు శర్మతో మాట్లాడడానికి కూడా ఒప్పుకోలేదు. ఉప ముఖ్యమంత్రిని చేయనూ లేదు. తనను కట్టడిచేయడానికే శర్మను పంపించారని తెలుసుకోలేనంతటి అమాయకుడు యోగీ కాడుగా! యోగీ నడవడిక ఎలా ఉంటుందంటే ప్రధానమంత్రి స్థానానికి మోదీ తరవాత తానే వారసుడినన్న అభిప్రాయం కలిగిస్తూ ఉంటారు. కానీ మోదీ అధికారం వదుకోవల్సివస్తే సాటి గుజరాతీ అయిన అమిత్ షానే ప్రధానమంత్రిని చేయడానికి ప్రయత్నిస్తారు. లోక్సభ ఎన్నికలలో యు.పి.లో బీజేపీకి ఘోరంగా బలహీనపడడంతో పాటు దేశవ్యాప్తంగా మెజారిటీ సాధించలేక పోయింది. మోదీ స్థానంలో ఎప్పుడో ఒకప్పుడు మరో నాయకుడిని ఆ స్థానంలో నియమిస్తారన్న ఊహగానాలు సాగుతూనే ఉన్నాయి. ఈ కారణంవల్లే యోగీ దూకుడుగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. యోగీ ఎంత హిందుత్వవాది అయినా రామమందిర నిర్మాణం, రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దు, ముమ్మారు తలాఖ్ విధానానికి చెల్లు చీటీలాంటివన్నీ మోదీ ఖాతాలోనే ఉన్నాయి. హిందూరాష్ట్ర ఏర్పాటుకు ఇవన్నీ సోపానాలు అని ఆర్.ఎస్.ఎస్. భావించడంలో ఆశ్చర్యం లేదు. ఈ దృష్టితో చూసినా యోగీని ప్రధానమంత్రిగా ఆర్.ఎస్.ఎస్. అంగీక రిస్తుందన్న నమ్మకం లేదు. మోదీ సూత్రీకరించినట్టుగా 75 ఏళ్ల వయసు వచ్చినవారు సకల పదవులూ వదులుకోవాలి. ఆ లెక్కన వచ్చేఏడాదికి అదే సూత్రం వర్తించాలి. మోదీ ఓటు ఎలాగూ అమిత్ షాకే. ఈ లోగా షాకు అడ్డులేకుండా చేయాలంటే యోగీని గద్దె దించాలన్నది మోదీ వ్యూహంలో భాగం అయిఉండొచ్చు. కానీ అంతిమ నిర్ణేత ఆర్.ఎస్.ఎస్. అన్నది యోగీతో సహా ఎవరూ విస్మరించకూడదు. యోగీ ఎంతటి నాయకుడైనా యు.పి. మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కన్నా అధికుడైతే కాదు. వాజ్పేయిని వ్యతిరేకించినందుకు కళ్యాణ్ సింగ్ కొన్నాళ్లపాటు బీజేపీకి దూరం కావలసి వచ్చింది. పైగా కళ్యాణ్సింగ్ లోధా అనే వెనుకబడిన తరగతికి చెందినవారు. యోగీ రాజపుత్రుడు. ఈ మధ్య రాజపుత్రులు బీజేపీ మీద గుర్రుగా ఉన్నారు. యోగీని గద్దె దించడానికి మోదీ-షా ద్వయం ఎంత బలంగా సంకల్పించినా ఆగస్టు ఆఖరు దాకా అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే యు.పి.లో పది శాసనసభా స్థానాలకు ఉపఎన్నికలు జరగవలసిఉంది. అదే యోగీకి ప్రస్తుతానికి శ్రీరామ రక్ష. 2022 ఎన్నికలకు ముందు కూడా యోగీ ఇదే సంకట స్థితిలో ఉండేవారు. ఆర్.ఎస్.ఎస్. దయాదాక్షిణ్యాలతో ఎదిగిన నాయకుడు కాదు కనక యోగీకి ఆ మాత్రం బింకం ఉండడం సహజమే.
– అనన్యవర్మ