సరైన రహదారులు లేక బడికి వెళ్లాలంటే విద్యార్థులు సాహసం చేయవలసిందే
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- : చిన్నపాటి వర్షానికి సైతం మండలంలోని పలు గ్రామాలకు ప్రయాణించాలంటే పడరాని పాట్లు పడవలసి వస్తోందని, లోతుగెడ్డ జంక్షన్ భీమనవీధి గ్రామా ప్రజలు వాపోతున్నారు. మట్టి రోడ్లు కావడంతో పాటు గుంతల మయం కావడంతో వర్షం కురిసిన ప్రతిసారి చిత్తడి చిత్తడిగా తయారవ్వడమే కాకుండా ఆ గుంతల్లో నీరు నిలిచి వాహన దారులు, ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారుల్లో నడిచి వెళ్లేందుకు సైతం పరిస్థితులు ప్రతికూలంగా తయారయ్యాయని ఈ ప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని భీమనవీధి నుండి లోతుగెడ్డ జంక్షన్ గ్రామానికి మధ్య రహదారి పరిస్థితి ఇది. గ్రామంలో వీధి రహదారుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. లోతుగెడ్డ జంక్షన్ లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఇదే బురద రహదారి గుండా పిల్లలు విద్య నభ్యసించేందుకు వెళుతుంటారు. వర్షాకాలంలో ఈ రహదారిలో పిల్లలు బడికి వెళ్లాలంటే సాహసం. చేయాల్సిందే. పాలకులు, సంబంధిత శాఖల అదికారులు చొరవ తీసుకుని మట్టి రహదారిని సిమెంట్ రహదారిగా నిర్మించాలని భీమనవీధి గ్రామస్తులు కోరుతున్నారు.