విశాలాంధ్ర,పార్వతీపురం: ఇసుక సరఫరా ఉచితమేనని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లా స్థాయి ఇసుక కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక సరఫరా ఉచితమే అని, ఇసుక తవ్వితీయుటకు, నిర్వహణకు, రవాణాకు జరిగే ఖర్చులను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇతర ఖర్చులు ఏమి ఉండదని, దానిని అధికారులు పక్కాగా పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. స్థానికంగా ఉండే చిన్న రీచ్ లకు మార్గదర్శకాలు రావలసిఉందని, అటువంటిచోట్ల జేసిబీలు వినియోగించరాదని ఆయన స్పష్టం చేశారు. ఇసుక రీచ్ ల వద్ద తాగు నీటి వసతులు, ఇతర మౌలిక వసతులు దెబ్బతినరాదన్నారు. ఒడిశా అనుమతులతో ఆంధ్రా ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయని, వాటిని పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా అనుమతులు లేని రీచ్ లలో తవ్వకాలు జరగరాదని అన్నారు. అనుమతులులేనిచోట్ల చేస్తే భారీ అపరాధ రుసుములు విధించడం జరుగుతుందని, వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇసుక సరఫరా పక్కాగా జరగాలని, ప్రతి అంశానికి రికార్డులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఉదయం 6 గంటలనుండి సాయంత్రం 6 గంటలవరకు రీచ్లు నిర్వహించాలని ఆయన అన్నారు. జిల్లాకు అవసరమగు ఇసుక అవసరాలను గుర్తించి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని ఆయన ఆదేశించారు. వంశధార నదీ తీరంలో కొత్త ఇసుక రీచ్ ల లభ్యతను గుర్తించాలని ఆయన సూచించారు. భామిని మండలం కాట్రగడవద్ద అనుమతుల మేరకు ఇసుక వెలికితీసి 10 రోజుల్లో కార్యకలాపాలు మొదలు పెట్టాలని జిల్లా స్థాయి ఇసుక కమిటి సమావేశం నిర్ణయించింది. నేరేడి, పసుపూడి వద్ద ఇసుక రీచ్ లను ప్రారంభించుటకు ప్రతిపాదనలు సమర్పించాలని కూడా నిర్ణయించింది.
జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక మాట్లాడుతూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు 43 ప్రకారం జూలై 8నుండి ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చిందని తెలిపారు. కిలోమీటర్ల దూరం మేర రవాణాచార్జీలు విధించడం జరుగుతుందని, దీనిని ఖరారు చేయడం జరుగుతుందన్నారు.
జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ వి మాధవ రెడ్డి, పార్వతీపురం రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి వి వెంకటరమణ, జిల్లా గనుల శాఖ అధికారి కె శ్రీనివాసరావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకరరావు, జిల్లా గ్రామ పంచాయతీఅధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లారవాణాఅధికారి ఎం శశికుమార్ , జిల్లా భూగర్భ జలాలు శాఖ అధికారి ఎ రాజశేఖర రెడ్డి, వంశధార ఇంజనీర్లు తదితరులు