పదేళ్లుగా వ్యాధితో బాధపడుతున్న హేమ
దుఃఖ సాగరంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- విద్యావంతురాలిగా చేతికి అంది వచ్చిన కుమార్తె గోపినాయక హేమ (25) గత పదేళ్లుగా సికిల్ సెల్ ఎనిమియా వ్యాధితో బాధపడుతూ విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచింది. హేమ ఆర్ట్స్ కోటిగా ఈ ప్రాంతంలో చిరపరిచితుడైన కోటేశ్వరరావు గారాలపట్టి హేమ. పెద్ద కుమార్తె అయిన ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. 15 ఏళ్ల ప్రాయంలోనే హేమ సికిల్ సెల్ ఎనిమియ బారిన పడింది. బొమ్మ గీసి, పెయింట్లు వేసుకుంటే గాని పూట గడవని నిరుపేద కుటుంబంలో పుట్టిన కోటేశ్వరరావు కుమార్తెను ఇంజినీరింగ్ వరకు చదివించాడు. ఇంజనీరింగ్ క్యాంపస్సింగ్ ఇంటర్వ్యూలో కంప్యూటర్ సాఫ్ట్ వేర్ లో బెంగళూరు, హైదరాబాద్, విశాఖలలో అవకాశం వచ్చినప్పటికీ ఆరోగ్యం బాగోలేని కారణంగా ఉద్యోగానికి వెళ్లలేని హేమ సికిల్ సెల్ ఎనిమియా కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురైంది. ఆమె అనారోగ్యం పాలు కావడంతో తల్లిదండ్రులు సైతం ఆ యువతిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో పరలోకపు పిలుపుతో హేమ కన్నుమూసిందని తెలిపారు. హేమ మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. యువతి స్వగ్రామమైన కడశిల్ప లో విషాద ఛాయలు అలముకున్నాయి.