యజమానులు పట్టించుకోకపోవడం వల్ల ప్రధాన రహదారుల్లో తిరుగుతున్న పశువులు
పశువులు రహదారులపై ఉండడం వలన చోటు చేసుకుంటున్న ప్రమాదాలు
రహదారులపై పశువులను విచ్చలవిడిగా వదిలేస్తే చర్యలు చేపడతామంటున్న అధికారులు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – ప్రధాన రహదారులపై మూగజీవాల మృత్యు ఘోష కొనసాగుతోంది. యజమానుల ఆలనా పాలనకు నోచుకోని పశువులు అటుపశుగ్రాసం లభించక రహదారులపై తిరుగుతున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న మన్యం రహదారుల్లో మూగజీవాలు రహదారులపై తిరుగుడుతుండడం, రహదారులపైనే నిద్రిస్తుండడంతో వాటిని గమనించలేని వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అదే క్రమంలో పశువులు సైతం మృతి చెందుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన రహదారులలో వాహనదారులు వేగ నియంత్రణ చేసినప్పటికీ, నిత్యం పశువులు రహదారులపైనే తిరుగాడుతుండడం వాహనదారులకు తలనొప్పిగా తయారైంది. గతుకుల మయమైన రహదారులలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మూగజీవాలు మరొక సమస్యగా తయారయ్యాయి. పశువులను పెంచుకునే యజమానులు వాటిని రాత్రిపూట ఇంటి వద్ద కట్టేసుకోకుండా ఇష్టారీతిన వదిలిపెడుతుండడంతో అవి రహదారులను పట్టుకుని తిరుగుతూ కూరగాయల దుకాణాలను నమ్ముకుని జీవిస్తున్నాయి. అదే క్రమంలో రాత్రిళ్ళు రహదారిపైనే నిద్రిస్తున్నాయి. వివిధ రంగులలో ఉండే పశువులు వాహనాలు నడిపే వ్యక్తులకు కనిపించని పరిస్థితులలో వాటిని ఢీకొని వారు ప్రమాదాలకు గురి కావడమే గాక పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. ప్రమాదాల నివారణకు, వాహనదారుల వేగనియంత్రణకు పోలీస్ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. మండల కేంద్రంలోని చింతపల్లిలో రోజుకో మూగ జీవి రహదారిపై విగత జీవిగా పడి ఉండటం స్థానికులని కలచివేస్తుంది. మూగజీవాలైన ఆవులు, ఎద్దులు, లేగదూడలు వంటి పశువులను వాటి యజమానులు, వాటి సంరక్షణకు శ్రద్ధ చూపకపోవడంతో అవి రహదారులపైనే నిద్రిస్తున్నాయి. రాత్రి వేళల్లో అటుగా వచ్చే వాహనదారులు వాటిని గమనించకుండా వాటి పైనుండే వాహనాలు పోనిస్తుండడంతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. కుక్కల విషయం అయితే చెప్పనవసరం లేదు…పట్టపగలే రోడ్లపై ఇష్టారాజ్యంగా సంచరిస్తూ ద్విచక్ర వాహనదారులకు చుక్కలు చూపించడమే కాకుండా అవీ గాయాల పాలవుతూ రహదారులపై విగత జీవులుగా దర్శనమిస్తున్నాయి. కుక్కలను ఢీ కొట్టి ఆసుపత్రి పాలైన ద్విచక్ర వాహనదారుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాల సమీపంలోనే ఈ ఘటనలు జరుగుతుంటాయి. మూగ జీవాలను అవసరాలకు వినియోగించుకోవడమే కానీ వాటి సంరక్షణకు యజమానులు శ్రద్ధ వహించకపోవడం దురదృష్టకరమని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామాలలో సంచరించే గోవుల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకున్నా ఇలా రహదారులపై వాటిని వదిలేస్తుండడంతో అవి ప్రమాదాలకు గురై మృత్యువాత పడటం జంతు ప్రేమికులను కలిచివేస్తుంది. మృతి చెందిన తర్వాత కళేబరాలను తొలగించేందుకు యజమానులు సైతం తమది కాదన్నట్టుగా ముందుకు రాకపోవడంతో వాటిని తొలగించి ఖననం చేసేందుకు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆవులు, దూడలు, ఎద్దులు, గుర్రాలు వంటి వాటి యజమానులు వాటిని సురక్షిత ప్రదేశాలలో ఉంచుకుని పెంచుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని, రహదారులపై వదిలేసి వాటి మరణానికి, వాటి వలన కలిగే ప్రమాదాలకు కారణం కావద్దని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఇక నుంచైనా వాహన చోదకులు గ్రామాలు, పట్టణాల పరిసరాలతో పాటు కూడళ్ళ సమీపంలో, ముఖ్యంగా రాత్రి సమయాలలో నిర్ణీత వేగంతో నిదానంగా వాహనాలు నడపాలని పలువురు సూచిస్తున్నారు. ఉన్నతాధికారులు, పంచాయతీ అధికారులు చొరవ చూపి రహదారులపై జీవాలను వదలకుండా, పాకలను ఏర్పాటు చేసుకొని సంరక్షించుకునే విధంగా అవగాహన కల్పించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.