హైదరాబాద్: బాధ్యతాయుతమైన పౌరులను రూపొందించడం లక్ష్యమని బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ (బీబీజీ) సీఎండీ మల్లికార్జున్ తెలిపారు. బాలికా సాధికారత కోసం బంగారు తల్లి కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. 2040 నాటికి రెండు మిలియన్ల బాలికలకు సాధికారత కల్పించాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. మెరుగైన భవిష్యత్తును సృష్టించే లక్ష్యంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో లక్షా డెబ్బై వేల మంది బాలికలకు సాధికారత కల్పించామన్నారు. రాబోయే కాలంలో విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. రెండు నెలలుగా బంగారు తల్లిలో భాగంగా నాలుగు వేల మంది విద్యార్థులతో నిమగ్నమై పాఠశాలలకు చేరుకోవడంపై దృష్టి సారించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక బాధ్యత, మానసిక పరిపక్వత, క్రమశిక్షణ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పట్ల గౌరవం, స్నేహ బంధం, బాధ్యత, దేశభక్తి తదితర అంశాలపై అవగాహన కల్పించామని తెలిపారు.