ఏపీయూడబ్ల్యూజే నాయకులు వనరాజు, దయానంద్.
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అనంతపురం జిల్లా రాప్తాడు లో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై ఆదివారం చోటు చేసుకున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్ వనరాజు, చింతపల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా గౌరవాధ్యక్షుడు వీ జె దయానంద్ లు అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో న్యూస్ కవర్ చేస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ పై ఆ పార్టీ నాయకులు దాడి చేయడాన్ని నిరసిస్తూ చింతపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక పాత్రికేయులు సోమవారం ప్రెస్ క్లబ్ నుండి పాత బస్టాండ్ వరకు అక్కడ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న పాత్రికేయులకు రక్షణ కల్పించాలని కోరుతూ తహసిల్దార్ రాధాకృష్ణమూర్తి కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎటువంటి వేతనాలు లేకున్నా నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి వాటి పరిష్కారానికే అటు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించే విలేకరుల పట్ల వైసిపి నాయకులు విచక్షణ రహితంగా దాడులకు తెగబడడం అమానుష చర్య అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సేవా దృక్పథంతో నిత్యం ప్రజల పక్షాన అటు పాలకులకు, ఇటు ప్రజలకు మధ్య వారదులుగా ఉన్న ఫోర్త్ ఎస్టేట్ పై దాడులకు పాల్పడడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఏ పార్టీ కార్యక్రమాలకైనా, రాజకీయ పార్టీలకు అతీతంగా న్యూస్ కవరేజ్ కు వెళ్లే పాత్రికేయులపై రాజకీయ పార్టీలు వ్యక్తిగత దాడులకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే పాత్రికేయుల లక్ష్యమన్నారు. ప్రభుత్వాలే తమకు భద్రత కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాత్రికేయులు షేక్ ఖాసిం వల్లి, అచ్యుతరామయ్య, పి శ్రీనివాసరావు, పాంగి సురేష్, జుర్రా ప్రసాద్, వెంకటరమణ, సోమరాజు, సత్తిబాబు, గాంధీ, సత్తార్, యు రమేష్, అప్పలరాజు, కోటి చిట్టిబాబు రవి, బాలరాజు, లోవ, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.