గిరి రైతులతో మాట్లాడుతున్న చింతపల్లి ఏ ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- శీతల వాతావరణం అన్ని రకాల పంటల సాగుకు అనుకూలమని ఈ విషయాన్ని ప్రతి రైతు గ్రహించి అసాంఘిక కార్యకలాపాలు అక్రమ వ్యాపారాలు గంజాయి సాగు వంటి సాగు జోలికి పోకుండా అనువైన పంటలు పండించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చింతపల్లి ఏ ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశమందిరం వద్ద కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సాగులు, వీరవరం గ్రామాలకు చెందిన గిరి రైతులకు పలు రకాల పంటలపై అవగాహన కల్పించారు. అల్లూరి జిల్లాలో గిరిరైతులు సీజనల్ పంటలు పండించేందుకు అనువైన వాతావరణం మన్యంలో ఉందని, బీసీటీ ద్వారా పలు రకాల పంటలపై పరిశోధనలు చేస్తున్నారన్నారు. రాయితీపై పసుపు, మిరియాలు పొడి చేసే యంత్రాలను, చిరు వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరుకు కృషి చేస్తామన్నారు. రాజ్మా పంట దెబ్బతింటుందని, పూలసాగు, పండ్లు మొక్కలు తదితర పంటలు ఏలా సాగు చేసుకోవాలని పలువురు రైతులు శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీసీటీ చైర్మెన్ శ్రీరామూర్తి, శాస్త్రవేత్త ప్రసాదరావు, ఎల్డీఎం రవితేజ, గూడెంకొత్తవీధి, చింతపల్లి సీఐలు అశోక్ కుమార్, రమేష్, ఎస్సై అరుణకిరణ్, పలువురు రైతులు పాల్గొన్నారు.