బీఎస్పీ అభ్యర్థి అప్పారావు
విశాలాంధ్ర – చింతపల్లి ( అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఆదరించండి అండగా ఉంటా అంటూ బహుజన్ సమాజ్ పార్టీ పాడేరు నియోజకవర్గ అభ్యర్థి సుర్ల అప్పారావు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తన మ్యానిఫెస్టోను పంచుతూ తనకు మద్దతు ఇవ్వాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఆదరించి ఆశీర్వదిస్తే గిరిజన ప్రజానీకానికి అండగా ఉంటానని రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కల్పించిన గిరిజన చట్టాలను, హక్కులను కాపాడేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. బూర్జువా పార్టీల పుణ్యమా అని ఇప్పటికే గిరిజనులకు రక్షణ కవచల్లా ఉండాల్సిన ఎన్నో చట్టాలు, హక్కులు కాలరాయబడ్డాయన్నారు. ఓటు బ్యాంకును చూసుకుంటూ చట్టాలను నిర్వీర్యం చేసే పార్టీలను, ఆ పార్టీలు చెప్పే మాయ మాటలను నమ్మి మోసపోవద్దని గిరిజనులకు ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.