విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అత్యంత మారుమూల పంచాయతీ అయిన బలపం పంచాయతీ పరిధిలోని కోరుకొండ గ్రామ సమీపంలో జియో టవర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ టవర్ నిర్మాణం వలన ఈ పంచాయతీ పరిధిలో సుమారు 18 గ్రామాలతో పాటు, పంచాయతీని ఆనుకొని ఉన్న పక్క రాష్ట్రమైన ఒరిస్సా ప్రాంత ప్రజలకు సెల్ సంకేతాలు అందుబాటులోకి రానున్నాయి. కోరుకొండ, కుడుముల, గిల్లలబంద తదితర గ్రామాలలో ఎయిర్టెల్ ఉన్నతాధికారులు టవర్ల నిర్మాణం చేపట్టి సెల్ సంకేతాలు అందించినప్పటికీ ఆన్లైన్ సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జియో టవర్ నిర్మాణం పూర్తి చేసి సెల్ సంకేతాలు అందుబాటులోకి వస్తే దాదాపుగా ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో చేసేందుకు వెసులుబాటు ఉంటుందని ఈ ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సేవల నిమిత్తం గతంలో సుమారు 15 కిలోమీటర్ల దూరమైన ఎర్ర గొప్ప వద్దకు వెళ్లి సేవలు పొందే వారమని, ఎయిర్టెల్ సేవలు అందుబాటులోకి రావడంతో కొంతమేర ప్రభుత్వ సేవలు సులభతరం కావడం జరిగిందని, జియో ఉన్నత అధికారులు వీలైనంత త్వరలో ఈ టవర్ పనులు పూర్తి చేసి సెల్ సంకేతాలు అందుబాటులోకి తీసుకురావాలని బలపం పంచాయితీ ప్రజలు కోరుతున్నారు.