వ్యాపారులు, వారపు సంతకు వచ్చిన ప్రజలకు సూచించిన ఏఎస్పి ప్రతాప్ శివ కిషోర్
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – మన్యంలోని వారపు సంతలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వ్యాపారులు, వారపు సంతలకు వచ్చే ప్రజలు సహకరించాలని స్థానిక ఏఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. బుధవారం చింతపల్లి వారపు సంతలో స్థానిక ఎస్సై అరుణ్ కిరణ్, పోలీస్ సిబ్బందితో కలిసి కలియతిరిగిన ఆయన ట్రాఫిక్ సమస్య క్రమబద్ధీకరణకై పోలీసు లకు సూచనలు ఇవ్వడమే గాక వ్యాపారులతోనూ, వారపు సంతకు వచ్చిన ప్రజలతోనూ ముఖాముఖి చర్చిస్తూ గ్రామంలో కాలినడకన తిరిగారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారస్తులను వ్యాపారాల విషయమై అడిగి తెలుసుకున్నారు. ఇదే క్రమంలో కూరగాయలు పండించడమే గాక స్వయంగా విక్రయించే మాలీలతో ఆయన ముచ్చటించారు. వారపు సంతలలో కూరగాయల విక్రయానికై ఏర్పాటు చేసిన సంత షెడ్ లను సద్వినియోగం చేసుకోవాలని రహదారికి ఇరువైపులా కూరగాయల దుకాణాలు వేయడం వలన ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందని ఈ విషయంలో వ్యాపారస్తులు సహకరించి వారికి కేటాయించిన సంత షెడ్ లను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అదే క్రమంలో ఆకర్షణీయంగా కనిపించిన పూల మొక్కల విక్రయం వద్ద కాసేపు ఆగిన ఆయన పూల మొక్కలు ఎక్కడ నుండి తీసుకువస్తున్నారు, వాటి రవాణా విక్రయం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.