లోతుగెడ్డ వైద్యాధికారి లక్ష్మీకాంత్
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- క్షయ వ్యాధిగ్రస్తులకు నిత్యవసర సరుకులను వితరణగా అందజేయడం అభినందనీయమని లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి లక్ష్మీకాంత్ అన్నారు. మండలంలోని క్షయ వ్యాధిగ్రస్తులకు బుధవారం నిత్యవసర సరుకులు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆముదాలవలస గ్రామానికి చెందిన ఎసెంటియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు సహృదయంతో మండలంలో నవంబర్ లో నమోదైన 16 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు ఆ నెల నుండి 6 నెలలపాటు నిత్యవసర సరుకులను వితరణగా అందించేందుకు ముందుకు రావడం, నాటినుండి ప్రతినెల అర్హులైన 16 మంది వ్యాధిగ్రస్తులకు క్రమం తప్పకుండా నిత్యవసర సరుకులను అందజేయడం అభినందనీయమన్నారు. ఇటువంటి సదవకాశాలను వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రతి ఒక్కరూ నిత్యవసర సరుకులను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మరోవైద్యాధికారిని జానకి, టీబీ సూపర్వైజర్ ప్రసాద్, గుల్లెల సింహాద్రి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు