తెదేపా మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- పాడేరు శాసనసభ నియోజకవర్గంలో విజయావకాశాలు పుష్కలంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అభివృద్ధి పేరిట కూటమిగా చేరిన జనసేన, బిజెపి పార్టీలు గ్రహణంగా మారాయని మండల అధ్యక్షుడు కిల్లో పూర్ణచంద్రరావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయిస్తామన్న తెదేపా అధినేత చంద్రబాబు మాటలు పాడేరు నియోజకవర్గంలో నీటి మూటలు అయ్యాయన్నారు. వైకాపాను ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుందన్నారు. ఇటువంటి తరుణంలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి టిక్కెట్ వస్తుందని భావించిన తెదేపా శ్రేణులకు అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఆశనిపాతంలా తయారైందన్నారు. ఈ నియోజకవర్గంలో కనీస ప్రభావం చూపలేని మిత్ర పక్షమైన భారతీయ జనతా పార్టీకి టిక్కెట్టు కేటాయించి పరోక్షంగా వైకాపా విజయం సాధించేందుకు సహకరించినట్లు అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచించి పాడేరు నియోజకవర్గంలో విజయావకాశాలు పుష్కలంగా ఉన్న తెలుగుదేశం పార్టీకే టికెట్ కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.