తెదేపా మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు.
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి టిక్కెట్టు కేటాయించకపోతే కూటమికి భంగపాటు తప్పదని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు కిలో పూర్ణచంద్రరావు, ఆండ్రాబు లక్ష్మణ్ అన్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు గొల్లోరి మంగు తో కలసి బుధవారం వారు మాట్లాడుతూ గడచిన ఐదేళ్లుగా అధికార వైకాపా వైఫల్యాలను ఎండగడుతూ నిత్యం ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసి అభ్యర్థిత్వం తెలుగుదేశం పార్టీకే కేటాయిస్తారని నమ్మకంతో ఉన్న పార్టీ శ్రేణులకు రాష్ట్ర అభివృద్ధి పేరిట కూటమిగా చేరిన జనసేన, బిజెపి పార్టీల కారణంగా పాడేరు నియోజకవర్గం బిజెపి కేటాయిస్తున్నట్లు ప్రకటించడం ఆందోళన కలిగించిందన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఎదిగిన తెలుగుదేశం పార్టీకి టిక్కెట్టు కేటాయించకపోతే కూటమి భంగపడవలసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. కూటమికి తామేమి వ్యతిరేకం కానప్పటికీ క్యాడర్ కలిగి ఉండి దాదాపు విజయం ఖాయమన్న సమయంలో తెదేపాను కాదని, మిత్రపక్షంలో భాగంగా ఇతర పార్టీలకు ఈ స్థానాన్ని కేటాయించడం వలన పాడేరు నియోజకవర్గంలో మరలా వైకాపా పుంజుకునే పరిస్థితి కనిపిస్తుందన్నారు. అటువంటి అవకాశాన్ని వైకాపాకు ఇవ్వకూడదనే లక్ష్యం ఉన్నందున తెదేపా గెలిచే స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించవద్దని వారు కోరారు.