పంట పొలాలను పరిశీలించి రైతులకు సలహాలు, సూచనలు చేసిన వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల బృందం
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- అల్పపీడన ద్రోణి ప్రభావంతో మన్య ప్రాంతంలో కురిసిన అధిక వర్షాల నుంచి పంటలను రక్షించుకునేందుకు గిరి రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బయ్యపురెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి బాల హుస్సేన్ రెడ్డి అన్నారు. స్థానిక మండల వ్యవసాయ శాఖ అధికారి బి శ్రీనివాసరావు తో కలిసి మంగళవారం మండలంలోని పలు పంచాయతీలలో రైతులను కలసిన వారు పంటల పరిస్థితి పై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడచిన పది రోజులుగా అల్లూరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మన్య ప్రాంతంలో సాగవుతున్న వ్యవసాయ పంటల పరిస్థితిని గమనించి రైతులకు తగు సలహాలు, సూచనలు అందించేందుకు తామంతా బృందంగా క్షేత్ర స్థాయి పంటల పరిశీలన చేయడం జరిగిందన్నారు. మండలానికి చెందిన అన్నవరం పంచాయతీ పనసలపాడు, లోతుగెడ్డ పంచాయతీలోని కోటకొండ, చౌడుపల్లి పంచాయతీలోని చదలపాడు గ్రామాలలోని వరి, వేరుశనగ, సామ, మొక్కజొన్న, రాగి, పసుపు తదితర పంటలను పరిశీలించడం జరిగిందన్నారు. అదే క్రమంలో బృందంలోని శాస్త్రవేత్తలంతా రైతులకు తగు సలహాలు, సూచనలు చేయడం జరిగిందన్నారు. అధిక వర్షాల నుంచి పంటలు త్వరగా కోలుకునేందుకు వీలైనంతవరకు పొలాల్లో ఉన్న నీటిని బయటకు పోయే ఏర్పాటు చేసుకోవాలన్నారు. పొలాలలో (నేలలు) అధిక తేమ తగ్గి తగినంత తేమ ఉన్న సమయంలో గుర్రు లేక గుంటగలతో అంతరిక్ష చేసి కలుపు నివారించుకోవాలన్నారు. నారుమడి దశలో ఉన్న వరిలో వీలైనంత వరకు నీటిని తొలగించి ఒక కిలో యూరియా, ఒక కిలో పొటాష్ కలుపుకొని నారుమడిలో చల్లాలనీ, నారుమడిలోని తెగుళ్ల నివారణకు ఒక లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజం మందును కలిపి నారు పై పిచికారి చేసుకోవాలన్నారు. నారు నాటిన 15 రోజుల నుంచి చిరు పొట్ట దశ వరకు పొలంలో పలుచగా నీరు పెట్టడం వలన ఎక్కువగా పిలకలు వచ్చి అధిక దిగుబడి పొందేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. పిలకల దశలో వరి పంట మునిగినట్లయితే నీరు బయటకు పోయిన తర్వాత ఎకరానికి 20 కిలోలు యూరియా, 20 కిలోల పొటాష్ అదనంగా వేసుకోవాలన్నారు. వేరుశనగ పంటలో తిక్క ఆకుమచ్చ తెగులు వ్యాపించే అవకాశం ఉన్నందున ఒక లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజం లేదా 2.5 గ్రాముల మ్యాంకోజబ్ చొప్పున పంట పై పిచికారి చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సచివాలయాల గ్రామ సహాయక వ్యవసాయ అధికారులు, అధిక సంఖ్యలో గిరి రైతులు పాల్గొన్నారు.