భోజన వితరణ చేసిన చేయూత వారియర్స్ ట్రస్ట్
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకై గడచిన 32 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు చేయూత వారియర్స్ ట్రస్ట్ అన్నివేళలా అండగా ఉంటుందని ఆ ట్రస్ట్ చైర్మన్ దూనబోయిన రమణ అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై గడచిన 32 రోజులుగా రోడ్లపై నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు సంఘీభావంగా భోజన వితరణ చేశారు. ప్రతిరోజు వివిధ మారుమూల గ్రామాల నుంచి వచ్చి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్న అంగన్వాడీలకు భోజన వితరణ చేయాలన్న సదుద్దేశంతో శుక్రవారం సుమారు 250 మందికి పైగా ఉన్న అంగన్వాడీలకు భోజన వితరణ చేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ఎల్లప్పుడూ సేవ చేస్తున్న అంగన్వాడీలకు భోజన వితరణ చేయడం బాధ్యతగా భావించానన్నారు. తమ సభ్యులతో కలసి చర్చించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. గర్భిణీలు, బాలింతల నుంచి నవజాత శిశువులు మొదలు ఆరేళ్ల చిన్నారుల వరకు ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందిస్తూ విశేష సేవలందిస్తున్న అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పాంగి ధనుంజయ్, సాగిన చిరంజీవి, ట్రస్టు సభ్యులు బిలాస్కర్, ఇండుగ శేఖర్, గంగల శివ, అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.