నేర పరిశోధన విభాగం (సిఐడి) సిఐ శ్రీనివాస్
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- విద్యార్థులు విద్యతో పాటు షెడ్యూల్ తెగల చట్టాలు, హక్కుల పై అవగాహన కలిగి ఉండాలని నేర పరిశోధనా విభాగం (సిఐడి) సర్కిల్ ఇన్స్పెక్టర్ జెర్రిపోతుల శ్రీనివాస్ అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో నేర పరిశోధన విభాగం (సిఐడి) సిఐ జెర్రిపోతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ఎంపీపీ కోరాబు అనూష దేవి, జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షురాలు దురియా పుష్పలత లతో కలిసి ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా సిఐడి సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ 1/70 చట్టం ద్వారా గిరిజన ప్రాంతంలో గిరిజనులకు సర్వాధికారాలున్నాయని గుర్తు చేశారు. అదే క్రమంలో పీసా చట్టం ద్వారా గ్రామసభలు ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు భూములు కొనుగోలు చేయటం, గిరిజనులకు చెందిన నిధులను దుర్వినియోగం చేయటం చట్టరీత్యా నేరమన్నారు. గిరిజనులకు 1950లో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమిటీలో సమాజానికి దూరంగా అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న షెడ్యూల్ తెగలను అంటరాని వారిగా ఉండటం, వారికి అందవలసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదని, ప్రత్యేక షెడ్యూల్ తెగల చట్టం ద్వారా అటవీ ప్రాంతాలలో నివాసం ఉంటున్న గిరి గ్రామాలకు విద్య, వైద్యం తో పాటు కనీస మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చట్టం రూపొందించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ చట్టం ద్వారా గిరిజనులకు ప్రత్యేకంగా ఐటీడీఏలు ఏర్పాటు చేసి ప్రత్యేక ఐఏఎస్ అధికారులను నియమించి ఆ చట్టాలను కాపాడుతూనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టం చేయడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నిర్వీర్యం కాకుండా గిరిజనులను పోలీస్ స్టేషన్ లో నేరుగా వెళ్లి కేసులు పెట్టుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. విద్యార్థులు విద్యతో పాటు గిరిజన చట్టాలు, హక్కులపై అవగాహన కలిగి గిరి గ్రామాల్లో గిరిజనులపై దాడులు చేస్తే వాటిపై దగ్గర లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు చిందాడ జయలక్ష్మి, తహశీల్దార్ లచ్చా పాత్రుడు, నేర పరిశోధన విభాగం సిఐడి ఎస్ఐ ఎస్ రామారావు, మండల విద్యాశాఖ అధికారులు పనసల బాల వీర వెంకట వరప్రసాద్, గెమ్మేలి బోడం నాయుడు, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల ప్రధానాచార్యులు మినుముల శ్రీనివాస్ పాత్రుడు, ఎన్ శివకుమార్, విద్యార్థిని, విద్యార్థులు వివిధ గ్రామాలకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు.