విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – సచివాలయ కార్యదర్శులను పంచాయతీ కార్యదర్శులుగా నియమించేందుకు జీవో నెంబర్ 11 పటిష్టంగా అమలు చేసి సచివాలయ కార్యదర్శులకు కార్యదర్శులుగా పదోన్నతి కల్పించాలని సచివాలయం కార్యదర్శులు కోరాబు శివకుమార్, లోచలి చిన్నం నాయుడు లు అన్నారు. వారి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎంపీడీవో వి వీర సాయిబాబాను మర్యాదపూర్వకంగా కలిసి జీవో నెంబర్ 11 ప్రకారం తమకు పదోన్నతి కల్పించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే డిప్యూటేషన్ కార్యదర్శులను రద్దుచేసి ప్రతి పంచాయతీకి కార్యదర్శిగా నియమించితే ఆ పంచాయతీలను అభివృద్ధి పరిచేందుకు దోహదపడుతుందని, తద్వారా ప్రజలకు సకాలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సచివాలయ కార్యదర్శులు సమర్పించిన వినతి పత్రాన్ని స్వీకరించిన ఎంపీడీవో వీర సాయిబాబు మాట్లాడుతూ జీవో నెంబర్ 11 పత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలు చేసి పంచాయతీలకు కార్యదర్శులుగా నియమించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.