తెదేపా మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాలుగవసారి ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు కేసరపల్లి వేదికగా ఘనంగా జరగనుందని ఆ పార్టీ చింతపల్లి మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు అన్నారు. ఆ పార్టీ అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం, గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద్ లతో కలిసి మంగళవారం ఆయన మాట్లాడుతూ వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడిన ప్రజలు ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించారన్నారు. గత ఎన్నికలలో 151 స్థానాలు ఇచ్చిన ప్రజలను వైకాపా ప్రభుత్వం గడచిన ఐదేళ్లు నిలువునా మోసగించిందన్నారు. అభివృద్ధిని విస్మరించిన వైకాపాకు తగిన సమయంలో ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారన్నారు. అధికార గర్వంతో వై నాట్ 175 అన్న వైకాపాను ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేశారన్నారు. గతంలో ఎన్నడూ కనీ, విని ఎరుగని రీతిలో ప్రజలు ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి 135 స్థానాలు ఇచ్చి అనుభవిజ్ఞుడైన చంద్రబాబు నాయుడుని ఆశీర్వదించారన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆలోచన చేసే నిరంతర ప్రజా శ్రామికుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నేడు ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణస్వీకారం చేస్తున్న ఆయనకు చింతపల్లి మండల కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు.