అసత్య ప్రచారాలు మానండి.. అబాసుపాలు కాకండి
జగనన్న పాలన, భాగ్యమ్మ నాయకత్వమే మాకు శిరోధార్యం
ఎంపీటీసీ సభ్యురాలు జయలక్ష్మి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – స్థానిక అంబేద్కర్ కాలనీకి చెందిన 70 కుటుంబాలు తెదేపాలో చేరినట్లు ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేయడం తగదని అసత్య ప్రచారాలకు పాల్పడి అబాసుపాలు కావద్దని ఎంపీటీసీ సభ్యురాలు చిందాడ జయలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ కాలనీలో ఉన్న దళితులమంతా వైకాపాలోనే ఉన్నామని, తమ కాలనీలో కనీసం ఏడు కుటుంబాల వారు కూడా తెదేపాకు అనుకూలంగా లేరని అటువంటి కాలనీలో ఉన్న కుటుంబాల మధ్య చిచ్చు రేపేందుకు తెదేపా నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించడం తెదేపా నాయకులకు తగదన్నారు. అసత్య ప్రచారాలతో అంతా తమకు అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం చేసుకోవడం తెదేపా నాయకులకే చెల్లిందన్నారు. అంబేద్కర్ కాలనీలో దళితులమంతా ఐకమత్యంతో ఉంటూ 2014 ఎన్నికలలోను వైకాపా అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరిని గెలిపించుకోవడం జరిగిందన్నారు. స్వప్రయోజనాల కోసం ఆమె పార్టీని వీడిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. పదవులు వచ్చాక నేతలు స్వపయోజనాల కోసం పార్టీలు మారుతున్నారే తప్ప నాయకులు, కార్యకర్తలమంతా వైకాపాలోనే కొనసాగు తున్నామన్నారు. తెదేపా మునిగిపోతున్న నావ అన్నారు. అసత్య ప్రచారాలతో ఉనికిని చాటుకునేందుకు తెదేపా నాయకులు తిప్పలు పడుతున్నారన్నారు. ఈ క్రమంలో తమ కాలనీలో ఏడు కుటుంబాలు కూడా తెదేపా వైపు లేరని అటువంటి చోట 70 కుటుంబాలకు చెందిన దళితులంతా తెదేపాలో చేరినట్లు తప్పుడు ప్రచారం చేయడం తెదేపా మండల నాయకులకు, ముఖ్యంగా మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి వంటి వారికి తగదన్నారు. ఇటువంటి దుష్ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం తెదేపా శ్రేణులకు అలవాటుగా మారిందని ఆమె విమర్శించారు. జగనన్న ముఖ్యమంత్రిగా, భాగ్యమ్మ నాయకత్వంలో అంబేద్కర్ కాలనీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగిందన్నారు. వైకాపాలో ఉంటూ లబ్ధి పొందిన ఒకరిద్దరు మాత్రమే వారి వారి స్వప్రయోజనాల కోసం నాలుగైదు కుటుంబాలకు చెందినవారు తెదేపాలో చేరారని, దానిని 70 కుటుంబాల వారు తమ పార్టీలో చేరినట్లు దుష్ప్రచారం చేయడం తెదేపా నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ఎం ధారబాబు, చిందాడ దొరబాబు, గడ్డం సోమరాజు, పి నాగేశ్వరరావు, దానియేలు, సిహెచ్ అప్పారావు, కే రాజు, వై రాజు, కుమారి, సత్యనారాయణ, శివకుమార్, సుమన్ అధిక సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొన్నారు.