ఆంధ్ర కశ్మీర్ లో పర్యాటకం ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు.
పారిశుద్ధ్య లోపంతో పెరుగుతున్న వ్యాధులు.
పట్టించుకోని పాలకులు, ఉన్నతాధికారులు.
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – ఆంధ్ర కాశ్మీర్ గా పేరెన్నికగన్న లంబసింగి పర్యాటక ప్రాంతంలో పారిశుద్ధ్య లోపం రాజ్యమేలుతుంది. శని, ఆదివారాలలో పర్యాటకులతో క్రిక్కిరిసిపోతున్న లంబసింగి తాజంగి తదితర ప్రాంతాలలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే దర్శనమిస్తుంది. మైదాన ప్రాంతాల నుంచి వచ్చే పర్యటకులు మన్య ప్రాంతంలోని అందాలను తిలకిస్తున్న నేపథ్యంలో పర్యటకులు వెంట తీసుకు వచ్చిన తినుబండరాలను తిని వ్యర్థాలను ఎక్కడ బడితే అక్కడ పడవేయడమే కాకుండా కాటేజీలు, గూడరాల చెంత మద్యం బాటిళ్లు, చెత్తతో దర్శనమిస్తున్న పరిస్థితి. ఇటువంటి దుర్భర పరిస్థితుల వలన ఆ ప్రాంతంలో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం శీతాకాలం కావడంతో మైదాన ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఈ ప్రాంతం ఆహ్లాదకరంగాను, స్థానికులకు సమస్యల చింత గాను తయారైంది. కాటేజీలు, గుడారాల నిర్వాహకులు ధనార్జనే ధ్యేయంగా పర్యాటకులను ఆహ్వానిస్తూ పర్యావరణ పరిరక్షణను గాలికి వదిలేస్తున్నారు. దీంతో అపారిశుద్ధ్యనికి కేంద్రంగా ఆంధ్ర కశ్మీర్ తయారవుతుంది. ఇటువంటి వాటిని నియంత్రించవలసిన పాలకులు, ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. కాటేజీలు, గుడారాల యజమానులపై పంచాయతీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు లేవని ఈ ప్రాంతీయులు ఆరోపిస్తున్నారు.