వైద్యాధికారిణ ఇందిరా ప్రియాంక
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం, ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రజలంతా సహకరించాలని చింతపల్లి ఏరియా ఆసుపత్రి వైద్యాధికారిణి ఇందిరా ప్రియాంక అన్నారు. బుధవారం చింతపల్లి వారపు సంతలో ఎయిడ్స్ వ్యాధి పై నాగ సాయి కళా జాతర బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక వైద్యాధికారిణి రుక్మిణి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ అనే వ్యాధి అంటువ్యాధి కాదని అంటించుకునే వ్యాధి అన్నారు. హెచ్ ఐ వి రోగులతో లైంగిక కలయిక, వ్యాధి ఉన్న వారికి వాడిన ఇంజక్షన్లు ఇతరులకు వాడడం, రక్తమార్పిడి ద్వారా ద్వారానే ఇది సోకే అవకాశం ఉందన్నారు. హెచ్ఐవి రోగులలో ముఖ్యంగా కనిపించే లక్షణాలు జ్వరం, నోటి పూత, చర్మ వ్యాధులు, నీరసం, నీళ్ళ విరేచనాలు, ఆకలి తగ్గిపోవుట, అలసట, పది శాతం బరువుని కోల్పోవడం, గ్రంథుల వాపు ( గొంతు క్రిందుగా ) మొదలగునవి అన్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు దగ్గరలో ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులు గ్రామాల్లో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఎయిడ్స్ వ్యాధి సోకి అనేకమంది మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయన్నారు. అంతకుముందు వ్యాధిని అరికట్టే వివిధ రకముల పద్ధతులను, ముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. దేశానికి భవిత యువతే అని, వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి సమాజాన్ని నిర్మించవచ్చని, పరిమితి లేని శృంగారం, మత్తు మందుల ద్వారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని, యువత చేతిలోనే బంగారు భవిష్యత్తు ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్య దేశాన్ని నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీటీసీ కౌన్సిలర్ కుమారి, ఐసిటిసి ల్యాబ్ టెక్నీషియన్ నెల్లి గోవింద్, ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ కుమార్, ఆరోగ్య మిత్ర పాంగి మల్లేశ్వరరావు, నాగసాయి కళాజాతర బృందం సభ్యులు పాల్గొన్నారు.