హైకోర్టు ను ఆశ్రయించిన ఇరు వర్గాలలో ఒక వర్గం కేసు ఉపసంహరించుకోవడంతో కొలిక్కి వచ్చిన సమస్య
రిసార్ట్స్ ను కలెక్టర్ ఆదేశాలతో బారంగి మీనాక్షి కి స్వాధీనం చేసిన రెవెన్యూ సిబ్బంది
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- తప్పుడు డాక్యుమెంట్లు పెట్టిన వారు కోర్టులో నెగ్గలేమనే ఉద్దేశంతో కేసు నుండి ఉపసంహరించుకోవడంతో న్యాయం గెలిచిందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నా యొక్క రిసార్ట్స్ ను మండల రెవెన్యూ అధికారులు అధికారికంగా నాకు అప్పగించారని మీనా రిసార్ట్స్ యజమానురాలు బారంగి మీనాక్షి అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ లంబసింగి పంచాయతీ లబ్బంగి గ్రామ సమీపంలో భూమి కొనుగోలు చేసి గడచిన నాలుగేళ్లుగా మీనా రిసార్ట్స్ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నానని, ఈ క్రమంలో గడచిన ఆరు నెలల క్రితం కొంత మంది వ్యక్తుల మాయమాటలు విని భూమి అమ్మిన వ్యక్తి తాను భూమి అమ్మలేదంటూ తగాదాకు రావడంతో స్పందనలో కలెక్టర్ ను కలవడం, విషయం వివరించడం జరిగిందన్నారు. ఇదే క్రమంలో మండల తహశీల్దార్ ను కలసి సమస్య చెప్పడం జరిగిందన్నారు. భూమి అమ్మిన వ్యక్తి కూడా తహశీల్దార్ ను సంప్రదించడంతో తగాదాలో ఉన్న రిసార్ట్స్ జోలికి ఇరువర్గాలు సమస్య పరిష్కారం అయ్యే వరకు వెళ్లరాదని ఇరు వర్గాలపై బైండోవర్ చేసి రిసార్ట్స్ ను తాత్కాలికంగా మూసివేశారన్నారు. ఈ విషయమై సదరు వ్యక్తి హైకోర్టు ను ఆశ్రయించడం జరిగిందని, తాను కూడా తన వద్ద నున్న డాక్యుమెంట్స్ తో హైకోర్టు ను ఆశ్రయించానని ఈ క్రమంలో తప్పుడు డాక్యుమెంట్లతో హైకోర్టు ను ఆశ్రయించిన సదరు వ్యక్తి కేసు ఉపసంహరించుకున్నారని, ఆ ఉపసంహరణ ప్రతిని తీసుకుని తాను కలెక్టర్ ను కలవడం జరిగిందన్నారు. దీనిపై వెంటనే మండల తహశీల్దార్ వారికి ఫోన్ చేసి రిసార్ట్స్ ను తనకు అప్పగించమని ఆదేశించారన్నారు. ఈ క్రమంలో తహశీల్దార్ సూచన మేరకు రెవెన్యూ అధికారులు కృష్ణ మూర్తి, భారతి లు వారి సిబ్బంది, గ్రామ పెద్దల సమక్షంలో మూసిన రిసార్ట్స్ ను అడ్డంకులన్నీ తొలగించి అధికారికంగా తనకు అప్పగించడం జరిగిందన్నారు. కొన్ని పత్రికలలో ఇరు వర్గాల మధ్య రాజీ కుదరడం వలన అని వచ్చిందని, రాజీ అనే ప్రసక్తే లేదన్నారు. న్యాయం గా కోర్టు ద్వారా తన ఆస్తి తనకు చెందిందన్నారు. అయినప్పటికీ భూమి తనకు అమ్మిన వ్యక్తి మొండిగా రిసార్ట్స్ వద్ద ఇబ్బంది పెడుతున్నారని, ఆ వ్యక్తిని రిసార్ట్స్ వద్దకు రాకుండా రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరుతున్నారు.