మార్చి ఏప్రిల్ నెలల్లోనూ మమ్మల్ని కొనసాగించండి.
సమాన పనికి సమాన వేతనం ఇప్పించండి.
అభ్యర్థిస్తున్న మాతృభాష వాలంటీర్లు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పాడేరు ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న మాతృభాష వాలంటీర్ల సేవలను ఫిబ్రవరితో నిలుపుదల చేయకుండా మార్చి, ఏప్రిల్ మాసాల్లోను రెన్యువల్ చేసి కొనసాగించాలని వివిధ గ్రామాలలో పనిచేస్తున్న మాతృభాష వాలంటీర్లతో పాటు విద్యార్థులు నిరసనలకు దిగారు.గిరిజన సంక్షేమ శాఖ విద్యా విభాగం ఆదివాసీ మాతృ బహుభాష విద్య (ఎం.టి.బి.ఎం.ఎల్.ఈ) గిరిజన ప్రాంతంలో స్థానిక మాతృభాష విద్య బోధకులను రెన్యువల్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఆదివాసి మాతృభాష విద్య బోధన కోసం స్థానిక యువతీ, యువకులకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 676 మందిని అల్లూరి జిల్లా నుండి 2023- 2024 విద్య సంవత్సరం పాఠశాల విద్యా కమిటీ ద్వారా నియమించింది. సమగ్ర శిక్ష లో నేటివ్ స్పీకర్స్ గౌరవ వేతనం 5000/- రూపాయలు మాత్రమే ఇస్తుంది. 2023 -24 సంవత్సరానికి గాను ఆగస్టు 1 నుండి ఫిబ్రవరి 29 వరకు సుమారు 676 మంది పాఠశాల విద్యా కమిటీ ద్వారా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 నుండి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ మాతృ బహు భాషా విద్య బోధన ప్రారంభించారు. నాటి నుండి వీరు కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులు లేని పాఠశాలలను కూడా ఆదివాసి మాతృభాష విద్య బోధకులు (నేటి స్పీకర్స్) నిర్వహిస్తున్నారు. నాడు10వ తరగతి అర్హతతో స్థానిక యువతీ, యువకులను ఐటిడిఏ ద్వారా నియమించారు. నేడు బీఈడీ, డైట్ ట్రైనర్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులైన ఉన్నత విద్యావంతులు కూడా బోధించడం వలన ప్రాథమిక విద్యలో నాణ్యత, నైపుణ్యత పెరిగింది. విద్యార్థుల డ్రాపౌట్స్ సంఖ్య తగ్గింది. ఉన్నత విద్యవైపు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా విద్య అందుబాటులోకి వచ్చింది. విద్యపై ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఆదివాసి ప్రజల్లో జీవన ప్రమాణాలు పెరగడంతో పాటు బాహ్య ప్రపంచంతో అనుసంధానం పెరిగింది. ఇంత విశిష్టమైన కృషి చేస్తున్న మాతృభాష వాలంటీర్ లకు 2024 మార్చి, ఏప్రిల్ వరకు యధావిధిగా కొనసాగించాలని, 5వ షెడ్యూల్ ప్రాంతంలో పివిటిజిల కోదు( కువి )కొండ, ఆదివాసి ఒరియా భాష మాట్లాడే తెగల వారున్నారని, ఈ ప్రాంతంలో మాతృభాష ఆధారత విద్య బోధనకు తాము చేస్తున్న కృషిని గుర్తించాలని మాతృభాష వాలంటీర్లు అభ్యర్థిస్తున్నారు. రాబోవు విద్యా సంవత్సరం (2024- 25) జూన్ నెల నుండి తమ సేవలను పూర్తిస్థాయిలో కొనసాగించే విధంగానూ, ఉద్యోగ భద్రత కల్పిస్తూ, సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా ప్రభుత్వ అధికారులు చొరవతీసుకోవాలని వారు కోరుతున్నారు.