కుండీ నిర్మాణమే గాక నీటిని తెచ్చుకునేందుకు సౌకర్యవంతంగా మెట్లు ఏర్పాటు చేసిన సర్పంచ్ పుష్పలత
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా):- మండల కేంద్రంలోని సాడిపేట వీధిలో నీటి సమస్యకు పరిష్కారం లభించింది. ఏళ్ల తరబడి ఊటనీటి ఆధారంగా నీటి సమస్యతో సతమతమవుతున్న సాడీపేట వాసులు ప్రతీ ఏటా ఎదుర్కొంటున్న నీటి సమస్యకు చెక్ పెట్టాలనే సత్సంకల్పంతో స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత ప్రత్యేక చొరవతో ఊటనీరు వృధా పోకుండా కుండి ఏర్పాటు చేయడమే కాక, లోతట్టు ప్రాంతంలో ఉన్న నీటిని తెచ్చుకునేందుకు అసౌకర్యంగా ఉన్న ఆ ప్రాంతంలో సిమెంటు రహదారితో పాటు మెట్లు ఏర్పాటు చేసి కుండీ నుండి సురక్షితమైన నీటిని తెచ్చుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. దీంతో సాడిపేట వీధికి చెందిన ప్రజల నీటి సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. నీటి సమస్య పరిష్కారం కావడంతో సర్పంచ్ పుష్పలతకు, ఆ పనులను సకాలంలో పూర్తిచేసిన గుత్తేదారులకు సాడిపేట వాసులు అభినందనలు తెలిపారు.