సిపిఐ మండల కార్యదర్శి పోతురాజు
విశాలాంధ్ర – చింతపల్లి( అల్లూరి సీతారామరాజు జిల్లా):- ఆడిన మాట తప్పి అంగన్వాడీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం వైకాపా అని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి పేట్ల పోతురాజు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ చిన్నారులకే గాక గ్రామస్థాయిలో గర్భిణీలు, బాలింతలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్న అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి వైకాపా ప్రభుత్వం నియంత్రత్వ పోకడతో నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. గడచిన 40 రోజులకు పైగా అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెను భగ్నం చేసేందుకు వైకాపా ప్రభుత్వం అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేస్తూ అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ అంగన్వాడీలు లేవనెత్తిన డిమాండ్ లను పరిష్కరించేందుకు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఆడిన మాట తప్పడం వైకాపా ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం లో చూడని విధంగా ఈ ప్రభుత్వ హయాంలో రోజుల తరబడి కాకుండా, నెలల, ఏళ్ల తరబడి సమ్మెలు కొనసాగుతున్న పరిస్థితిని చూస్తున్నామన్నారు. అంగన్వాడీలు తమ న్యాయమైన 11 డిమాండ్ల సాధనకై పర్వదినాలను సైతం పక్కనపెట్టి సమ్మెను కొనసాగించడం అభినందనీయమన్నారు. అటువంటి అంగన్వాడి ల సమ్మెను భగ్నం చేసేందుకు వారిపై ఎస్మా ప్రయోగించడం, నేడు గృహనిర్బంధాలు చేయడం వైకాపా నియంత్రతో విధానాలకు నిదర్శనం అన్నారు. అంగన్వాడీలను మోసగించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాబోవు సార్వత్రిక ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఆ పార్టీ సీనియర్ నాయకుడు గెమ్మేల కుజ్జన్న పాల్గొన్నారు