తెదేపా మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా ) :- రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.. గెలుపు గుర్రాలకి టికెట్లు అనే నిర్ణయం ఏమైందని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కిలో పూర్ణ చంద్రరావు అన్నారు. ఆ పార్టీ మండల నాయకులతో సమావేశమైన ఆయన పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పాడేరు నియోజకవర్గంలో అధికార వైకాపాను ఢీకొట్టే సత్తా కలిగిన తెలుగుదేశం పార్టీని కాదని మిత్రపక్షాలకు ఈ స్థానాన్ని కేటాయించడం ఎంతవరకు సమంజసం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, గెలుపు గుర్రాలనే బరిలో దించుతాం, అనే అధిష్టానం నినాదాలు ఏమయ్యాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మిత్రపక్షాలతో కలసి పనిచేందుకు తమకేమీ అభ్యంతరం లేదన్నారు. కానీ ఈ నియోజకవర్గంలో బిజెపి కి గాని, జనసేనకు గాని పూర్తిస్థాయిలో కేడర్ లేదన్నారు. పట్టుమని 100 ఓట్లు లేని పార్టీలకు సీటు కేటాయించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. గెలిచే అవకాశాలు ఉన్న తెలుగుదేశం పార్టీని కాదని మిత్రపక్షాలకు ఈ స్థానాన్ని కేటాయించడం వలన పరాభవం తప్పదన్నారు. మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశంతో పాటు బిజెపి, జనసేన పార్టీలు కూడా ఈ విషయంలో పునరాలోచన చేయవలసిన అవసరం ఉందన్నారు. ఆ పార్టీలకు కనీస బలమున్నచోట్ల సీట్లు పొందాలి తప్ప పూర్తిస్థాయి పార్టీ క్యాడర్ లేని చోట సీట్లు తీసుకుని పరాభవానికి గురికావడం సరైన విధానం కాదని హితవు పలికారు. మిత్ర ధర్మం అంటూ మొండిగా ఆలోచించి పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కాకుండా బిజెపి, జనసేన లకు టిక్కెట్టు కేటాయిస్తే మరలా పాడేరు నియోజకవర్గంలో వైసీపీకి రెడ్ కార్పెట్ పరచినట్లేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు