పిండి వంటలతో స్వయం ఉపాధి పొందుతున్న
గృహిణి నంబారి సత్యవతి
విశాలాంధ్ర – చింతపల్లి ( అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పిండి వంటలతోనే స్వయం ఉపాధి పొందుతున్నానని లోతుగెడ్డ జంక్షన్ గ్రామానికి చెందిన గృహిణి నంభారి సత్యవతి అన్నారు. భర్త కాలం చేయడం, కుమారులు లేక పోవడం, కుమార్తెలకు వివాహాలు జరగడంతో ఒంటరిగా ఉన్న సత్యవతి తన భర్త స్వర్గీయ నంబారి తాతాలు ఉన్నంత కాలం నడిపిన చిన్నపాటి కిరాణా వ్యాపారాన్ని చూసుకుంటూ జీవనం సాగించేది. కాలక్రమంలో గ్రామంలో కిరాణా, తదితర వ్యాపారాలు పెరిగి పోవడంతో ఒంటరి మహిళ గా ఉన్న ఆమె కిరాణా వ్యాపారులతో పోటీ పడలేక ప్రత్యామ్నాయ వ్యాపారం చేయాలని ఆలోచన చేశారు. పక్క ఇంటిలో ఉన్న అమ్మాయిని సహాయంగా తీసుకుని శీతల (కూల్ డ్రింక్స్) పానీయాలు, పిండి వంటల వ్యాపారం ప్రారంభించారు. పిండి వంటల వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచుతూ రకరకాల పిండి వంటల రుచులను ఈ ప్రాంతీయులకే గాక, ఆంధ్ర కశ్మీర్ గా పేరొందిన లంబసింగి, తాజంగి, చెరువుల వేణం, ఇదే మార్గం లో జీ మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం తదితర చోట్లకు తరలివచ్చే పర్యాటకులకు పరిచయం చేశారు. పిండి వంటల తయారీ లో ఎంతో ప్రావీణ్యం గడించిన ఆమె చేతితో తయారు చేయబడిన పిండి వంటలను రుచి చూసిన స్థానికులు, పర్యాటకులు ఆ రుచులను మరువ లేరంటే అతిశయోక్తి కాదు. ఆమె తయారు చేసే గారెలు, బూరెలు, బోండాలు, వివిధ రకాల బజ్జీలు, నేతి గారెలు, జంతికలు, మసాలా బోండాలు, ఖాజా, జిలేబీ ఇలా అనేక రకాల రుచి కరమైన పిండి వంటలకు పెట్టింది పేరు లోతుగెడ్డ జంక్షన్ కు చెందిన గృహిణి నంబారి సత్యవతి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఇటువంటి రుచులను రుచి చూసేందుకు మన్యానికి తరలివచ్చే పర్యాటకులు లోతుగెడ్డ జంక్షన్ లో తయారయ్యే పిండి వంటలను రుచి చూసేందుకు రావాలని ఆమె కోరారు.