గొందిపాకల ఎంపీటీసీ సభ్యుడు మోహన్ రావు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – దేశంలో ఎక్కడ అమలు కాని విధంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు 3వేల రూపాయల పెన్షన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైకాపా అని ఈ పథకం లబ్ధిదారులకు వరమని గొందిపాకల ఎంపీటీసీ సభ్యుడు తాంబేలి. మోహన్ రావు అన్నారు. మండలంలోని గొందిపాకల పంచాయతీ సమగిరి గ్రామంలో నూతనంగా పెంచిన వైయస్ఆర్ పెన్షన్ కానుకను ఆ పంచాయతీ కన్వీనర్ పొటుకూరి బెన్నాస్వామి తో కలసి లబ్ధిదారులకు పెన్షన్ అందించారు. ఈ కార్యక్రమంనుద్దేశించి వారు మాట్లాడుతూ మునుపెన్నడూ ఏ ప్రభుత్వం అందించని సంక్షేమ పథకాలను అందించడమే గాక గత ప్రభుత్వాల హయాంలో 2000 మించని పెన్షన్ పథకాన్ని నేడు మూడువేల రూపాయలకు పెంచి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని వారు కొనియాడారు. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మూడువేల రూపాయల పెన్షన్ పథకంతో ఆర్థిక ఆసరాగా ఉన్న వైకాపా ప్రభుత్వాన్ని రాబోవు సార్వత్రిక (2024) ఎన్నికలలో మరో మారు గెలిపించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పంచాయతీ వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పెన్షన్ దారులు, గ్రామస్తులు పాల్గొన్నారు