విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.01.05.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని నరసయ్య పేట, రమణయ్య పేట, గాంధీ గ్రామంలో ఇండియా కూటమి అభ్యర్థి జగతా శ్రీనివాసరావు బుదవారం ఇంటింటి ప్రచారం చేశారు. భూ సంస్కరణలు పేరుతో అన్ని వర్గాల ప్రజలు జీవన విధానానికి విఘాతం కలిగించే భూ హక్కుల చట్టం రూపొందించి, ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలను ప్రజలు నమ్మరాదని, ఓటు అనే వజ్రాయుధంతో బుద్ధి చెప్పాల్సిందిగా కోరారు. అఖండ భారతావని ప్రజలను బానిసత్వం నుండి విముక్తి చేసి, స్వేచ్చా స్వాతంత్ర్యాన్ని సాధించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను బ్రతికించాలని కోరారు. ప్రాంతీయ, మతతత్వ పార్టీలు ప్రజల్లో కుమ్ములాటలు పెట్టి రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకుని కార్పొరేట్ కంపెనీలను పెంచి పోషిస్తున్నాయని తెలియజేసారు. జాతీయ కాంగ్రెస్ తోనే రాష్ట్రం లో సుస్థిరత సాధ్యమవుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వందల ఏళ్లు ప్రజాదరణ పొందిన జాతీయ కాంగ్రెస్ ను బలపరచాలని, రాబోవు ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించి, ఇండియాను రక్షించాలని కోరారు. ఇండియా కూటమి నాయకులు ఆధ్వర్యం లో ఇంటింటి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు తెలియజేసి హస్తం గుర్తు కి ఓటు వేయమని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ శనివాడ నూకరాజు, వామపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.