కార్మికుల సమస్యలను పరిష్కరించాలి …
విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.16.01.2024ది. చెరుకు తరలింపుకు తగినన్ని లారీలు ఏర్పాటు చేసి లేబర్ సమస్యలను పరిష్కరించాలని, తూనిక కేంద్రాల వద్ద వారాల తరబడి ఎండపోతున్న చెరకును తక్షణమే తరలించాలని ఏ.పి. రైతుకూలీ సంఘం
గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చెరుకు కొనుగోలు కేంద్రమైన ఏ.భీమవరం కాటా వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో చెరుకు రైతులు, కాటాల నుండి చెరుకు తరలింపులో ఫ్యాక్టరీ యాజమాన్యం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రైతుకూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) జిల్లా కార్యదర్శి కోన మోహన్ రావు మాట్లాడుతూ,
గోవాడ సుగర్ ఫ్యాక్టరీ 2023-24 క్రషింగ్ సీజన్ ప్రారంభమై నెలరోజులు గడుస్తుందని తెలిపారు. సీజన్ ప్రారంభంలోనే ఫ్యాక్టరీలో యంత్రాలు, బాయిలర్, సాంకేతిక సమస్యలతో ఫ్యాక్టరీ క్రషింగ్ లో అంతరాయాలు ఏర్పడ్డాయిన్నారు. అలాగే ఫ్యాక్టరీకి కాటాల నుండి చెరుకు తరలింపు కోసం ఏర్పాటు చేసుకున్న లారీలను కాంట్రాక్టర్ తగినన్ని ఏర్పాటు చేయకపోవడంతో కాటాల వద్ద వారాల తరబడి చెరుకు ఎండిపోతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
గోవాడ సుగర్స్ పరిధిలో భీమవరం కాటా మీదే 500 మంది సభ్య రైతులు గత ఏడాది 4వేల టన్నుల చెరుకు సరఫరా చేశారని తెలిపారు. ఈ కాటాకు రోజువారి కనీసం మూడు లారీలను చెరుకు తరలింపు కోసం ఏర్పాటు చేయాల్సి ఉంది, కానీ మూడు, నాలుగు రోజులకు కూడా కేవలం ఒకటి, రెండు లారీలని మాత్రమే పంపించడంతో కాటా వద్ద వారం రోజుల క్రితం తెచ్చిన చెరుకు కూడా ఇప్పటికీ తూకం కాలేదన్నారు. సంక్రాంతి పండగ పూట అందరికీ తీపిని పంచుతున్న చెరుకు రైతుకు మాత్రం చేదే మిగులుతుందని తెలియజేశారు. కావున తక్షణమే చెరుకు తరలింపులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని, తగినన్ని లారీలు ఏర్పాటు చేసే విధంగా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని,
ఫ్యాక్టరీ క్రషింగ్ లో వస్తున్న ఆటంకాలను, సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం, పర్సన్ -ఇన్ ఛార్జ్ జిల్లా కలెక్టర్ గారు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ ఆధునీకరణకు, పరిరక్షణకు ప్రభుత్వం నిధులను కేటాయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏ. భీమవరం కాటా రైతులు తర్రా నారాయణరావు, తర్రా అప్పారావు, తర్రా మహేష్, కొమార గంగునాయుడు, కోన దుర్గేష్ ,వల్లంశెట్టి రామారావు, దన్ని నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.