– పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలు ..
– తక్షణమే పాత చెరువు లో భూ కబ్జాలు తొలగించాలి ….
– మామూళ్ల మత్తులో మొద్దు నిద్ర నటిస్తున్న ప్రభుత్వ అధికారులు …
– దర్జాగా ప్రభుత్వ, పంచాయతీ స్థలాలు కబ్జా …
– కబ్జా స్థలాల్లో వ్యాపారాలు నడుపుతున్న చోడవరం వై.సి.పి. ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు …. విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.08.06.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం మేజర్ పంచాయతీలో వై.సి.పి. నేతలు ప్రభుత్వ, పంచాయతీ స్థలాలు కబ్జా, వాటిల్లో అక్రమ నిర్మాణాలు దర్జాగా చేపడుతున్నను పంచాయతీ, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో చూసి చూడనట్లు నటిస్తున్నారని పలు ప్రజా, మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. చోడవరం మేజర్ పంచాయితీ ఉప సర్పంచ్, స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ ప్రధాన అనుచరుడు పుల్లేటి వెంకటరావు స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్ ఎదురుగా మెయిన్ రోడ్ లో పంచాయతీ స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి వ్యాపారాలు నడుపుతున్నారు. అలాగే ఇదే ఆవరణలో గ్రామ సర్పంచ్ అండతో చోడవరం జన్మభూమి షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా (చోడవరం ప్రాధమిక సహకార బ్యాంకు వద్ద) డ్రైనేజీ కాలువను కప్పి, మీ సేవ నోటరీ, స్టాంప్ పేపర్లు అమ్మకాలు చేసే మరో వెంకటరావు పంచాయతీ స్థలం కబ్జా చేసి, భారీ డ్రైనేజీ కప్పి, కబ దానిపై దర్జాగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడు. అక్రమార్కులు, పంచాయతీ/రెవెన్యూ అధికారుల మామూళ్ల అవగాహనతో చోడవరం మేజర్ పంచాయతీలో దురాక్రమణలు పెచ్చు మీరుతున్నాయి. చోడవరం మేజర్ పంచాయతీ, బి.ఎన్.రోడ్డులో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రెవెన్యూ సర్వే నెంబరు .82 లో సుమారు 39 ఎకరాల 65 సెంట్లలో వున్న పాత చెరువును వై.సి.పి, తాజా అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే, రాజకీయ నాయకుల అండదండలతో ఆర్టీసీ నుండి లీజు పేరుతో భూ కబ్జా లకు పాల్పడుతున్నారని సి.పి.ఐ., రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఈ ఏడాది జనవరి నెలలో స్పందన కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై రెడ్డిపల్లి మాట్లాడుతూ అక్రమంగా, దౌర్జన్యంగా చోడవరం పాత చెరువును గ్రావెల్ తో కప్పుతున్నారని దీనిపై రెవెన్యూ, పంచాయతీ, ఎండోమెంట్, ఇరిగేషన్ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేసినను, దురాక్రమణదారులపై చర్యలు చేపట్ట లేదని ఆరోపిస్తున్నారు. పాత చెరువు దురా క్రమణలపై జిల్లా కలెక్టర్ దృష్టిలో పెట్టామని, అతి పెద్ద చెరువును అక్రమంగా కప్పేస్తున్నారని తక్షణమే దురాక్రమణ దారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక పాత చెరువును, ఆయకట్టు రైతాంగాన్ని కాపాడాలని కోరారు.
గతంలో ఎండోమెంట్ నుండి ఆర్టీసీకి మూడెకరాల 71 సెంట్లు గిఫ్ట్ గా ఇచ్చారని,
ఆర్టీసీ వాళ్ళు వాడకుండా వున్న మిగిలిన స్థలాన్ని ఎండోమెంట్ వారికి తిరిగి అప్పజెప్పాలన్నారు.
పాత చెరువు క్రింద సుమారు 1600 ఎకరాల ఆయకట్టులో, రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తాన్నారన్నారు. సాగునీరు లేక వ్యవసాయం పూర్తిగా నష్టాలు బాట పడుతుండగా, చెరువులు కబ్జా చేసి రైతులకు నీరు లేక ఇబ్బంది కలిగించడం అన్యాయమన్నారు.
కొన్ని వందల మత్స్యకార కుటుంబాలు ఇక్కడి మత్స్య సంపదతో జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
చోడవరలో అతి పెద్ద చెరువును మూసివేస్తే చోడవరంలో సుమారు 60,000 లకు పైగా జనాభా వాడిన మురికి నీరు, వర్షం నీరు చెరువులోకి రాకుండా ప్రధాన కాలవలను మూసివేస్తున్నారని తెలియజేశారు. దీనివలన పట్టణ డ్రైనేజీలు దెబ్బతిని ఊరు మునిగిపోయే అవకాశం ఉందన్నారు. పాత చెరువు దురాక్రమణ వలన ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువ అని కలెక్టర్ కు వివరించామన్నారు. పాత చెరువు దురాక్రమణలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేసారు. పాత చెరువులో వేసిన గ్రావెల్ మట్టిని వెంటనే తొలగించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి.అప్పలరాజు డిమాండ్ చేస్తూ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. సాగు త్రాగునీటి చెరువులు కాపాడాలని కోరారు. వీటిపై తక్షణమే పంచాయతీ, రెవెన్యూ ఉన్నతాధికారులు దృష్టి సారించి భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలకు పాల్పడే అక్రమార్కులకు చెక్ పెట్టాల్సినదిగా డిమాండ్ చేస్తున్నారు.