ఇంచార్జి జిల్లా కలెక్టర్ కేతన్ గార్గ్
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఎన్నికల అబ్జర్వర్ల రాక నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేయాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాకు ఎన్నికల అబ్జర్వర్ ల రాక నేపథ్యంలో సంబంధిత నోడల్ అధికారులు, లైజన్ అధికారులు, ఆర్డీఓ, ఆర్అండ్బి, పోలీస్, తదితర అధికారులతో ఇంచార్జి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల కోసం త్వరలో జనరల్ అబ్జర్వర్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్ లు జిల్లాకు రానున్నారన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ప్రొఫైల్స్, రిపోర్టులను, సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అబ్జర్వర్ల కోసం లైజన్ అధికారులను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి ఆర్అండ్బి అతిథి గృహాలలో, జిల్లా పరిషత్, ఆర్డిటి, ఎస్కేయూ, జేఎన్టీయూ అతిథి గృహాలను తనిఖీ చేయాలని, అవసరమైన అన్ని రకాల మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అతిథి గృహాల్లో ఫర్నిచర్, కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని, అబ్జర్వర్ల కోసం వాహనం, వీడియోగ్రాఫర్, గన్మెన్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. చెక్ లిస్ట్ ఏర్పాటు చేసుకొని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. అబ్జర్వర్లు ఎక్కడికి వెళ్ళినా సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమాచారం తెలియజేయాలని, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదన్నారు. అబ్జర్వర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా అన్ని రిపోర్టులను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ జి.వెంకటేష్, ఆర్అండ్బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, డిఎల్డివో శంకర్, లేబర్ డీసీ, పరిశ్రమల శాఖ ఏడి రాజశేఖర్ రెడ్డి, నోడల్ అధికారులు, లైజన్ అధికారులు పాల్గొన్నారు.