. ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపడుతున్నాం
. జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్)
విశాలాంధ్ర – అనంతపురం : ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుండి గురువారం సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, తదితరులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.
అనంతపురం కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్), నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా కౌంటింగ్ కోసం అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపడుతున్నామన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ను అనంతపురం జేఎన్టీయూలోని మెయిన్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఈసిఈ డిపార్ట్మెంట్ భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని, ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రాలలో బ్యారీ కేడింగ్ చేపట్టామని, జేఎన్టీయూలో అభ్యర్థుల కోసం క్యాండిడేట్ / ఎలక్షన్ ఏజెంట్ రూమ్ ని ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కోసం తాగునీరు, భోజనం, తదితర అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద సిఏపిఎఫ్, ఎస్ఏపి, సివిల్ బలగాలను ఏర్పాటు చేశామని, అన్ని కౌంటింగ్ కేంద్రాలలో, స్ట్రాంగ్ రూముల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మరియు కౌంటింగ్ కోసం అడిషినల్ ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందని, కౌంటింగ్ అధికారులకు మొదటి ర్యాండమైజేషన్ ఈనెల 23న నిర్వహించనున్నామని, వారికి త్వరలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాల సన్నద్ధంగా ఉంటూ పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రిటర్నింగ్ అధికారులు రాణిసుస్మిత, కరుణకుమారి, వి.శ్రీనివాసులు రెడ్డి, వసంతబాబు, వెన్నెల శ్రీను, జి.వెంకటేష్, పార్లమెంటరీ నియోజకవర్గం ఏఆర్ఓ రమేష్ రెడ్డి, ఈఆర్ఓ శిరీష, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, నోడల్ అధికారులు గురుస్వామి శెట్టి, రఘునాథరెడ్డి, బసవరాజు, ప్రభాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.