విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : సమాజ హితంలో ముందుండే అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అందించే సేవలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి దీన బాబు పేర్కొన్నారు. సోమవారం న్యాయ సేవ సదన్ లో సమగ్ర శిశు అభివృద్ధి పథకం సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు, అధికారులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సంస్థ కార్యదర్శి దీనబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో లోకదాలత్, శాశ్వత లోక్అదాలత్, మధ్యవర్తిత్వం, బాల్య వివాహాల నిరోధం, అక్రమ మానవ రవాణా నిరోధం తదితర అంశాలపై వక్తలు అవగాహన కల్పించారు. న్యాయమూర్తి దీనబాబు మాట్లాడుతూ చిన్నారులకు అక్షరాభ్యాసం మొదలు వ్యక్తిత్వ వికాసానికి, ఆరోగ్యానికి దోహదపడే పలు సేవలు అంగన్వాడీ కార్యకర్తలు అందిస్తున్నారని బాల్య వివాహాలు, అక్రమ మానవ రవాణా నిరోధం లోనూ సకాలంలో సమాచారం అందించి సహకరించాలని కోరారు. ఉచిత న్యాయ సహాయం పొందటానికి అర్హులైన ప్రతి ఒక్కరికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సేవలందించడానికి సిద్ధంగా ఉంటుందని అన్నారు.
శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ కె. శ్రీనివాస రావు ప్రజా ప్రయోజన సేవల కేసుల్లో శాశ్వత లోక్ అదాలత్ పని తీరును వివరించారు. ప్రజా ప్రయోజనాల శాశ్వత లోక్ అదాలత్ లో ఫిర్యాదు దాఖలు చేయటానికి ఎటువంటి కోర్టు ఫీజు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇరుపక్షాల నడుమ సామరస్య పరిష్కారానికి అవకాశం కల్పిస్తు , సామరస్య పరిష్కారానికి సహకరించని పక్షంలో అందుబాటులో ఉన్న ఆధారాల మూలకం గా ఆ కేసులో తీర్పు వెలువరించగల అధికారం వుండగా అప్పిలుకు ఆస్కారం లేని శాశ్వత పరిష్కారంగా ఈ తీర్పు వుంటుందని తెలిపారు.సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
మధ్యవర్తిత్వ కేంద్ర సభ్యులు న్యాయవాదులు ఎన్. హరికృష్ణ, జి పద్మజ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ సుబ్రమణ్యం, మిషన్ వాత్సల్య ప్రతినిధి చంద్రకళ, వన్ స్టాప్ సెంటర్ శాంతా మణి, పట్టణ సిడిపిఓ లలిత, రూరల్ సి డి పి ఓ ధనలక్ష్మి, ప్రసంగించారు. ఆగస్టు నెల మొత్తం బాల్యవివాహాల నిరోధక మాసంగా పరిగణిస్తూ అన్ని శాఖల సమన్వయంతో విస్తృతంగా మారుమూల ప్రాంతాలలో నిర్వహించే అవగాహన కార్యక్రమాలలో లోకదాలత్ శాశ్వత లోకదాలత్ సామాన్యులకు అందించే ఉచిత న్యాయ సేవల గురించి కూడా వివరిస్తామని ఐసిడిఎస్ అధికారులు పేర్కొన్నారు. ఉచిత న్యాయ సేవలు గోడపత్రికలను అంగన్వాడీ కేంద్ర ప్రతినిధులకు న్యాయమూర్తి దీనబాబు అందజేశారు.