విశాలాంధ్ర-రాప్తాడు : వచ్చే నెల 4వ తేదీన అనంతపురం జేఎన్టీయూలోని ఈసీఈ విభాగంలో జరగనున్న రాప్తాడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి వసంతబాబు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లతో మంగళవారం రాప్తాడు అసెంబ్లీ, హిందూపురం పార్లమెంట్ ఓట్ల కౌంటింగ్ నిర్వహణపై రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వసంతబాబు మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపులో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందనీ, 6 గంటలకు ఏజెంట్లు, అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే వారు ఐడీ కార్డులు ధరించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో తహశీల్దార్ టి.సీతారాం, ఏఆర్ఓలు, ఈడీటీలు, డీటీలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.