ధర్మవరం చేనేత వ్యాపారస్తులు డిమాండ్
విశాలాంధ్ర – ధర్మవరం : గత కొన్ని రోజుల కిందట ధర్మవరం వ్యాపారస్తులపై దాడి చేసిన విజయవాడ ఆలయ సిల్క్స్ అధినేత అవినాష్ తో పాటు పలువురులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్మవరం పట్టుచీరలు పట్టుచీరల తయారీ వ్యాపారస్తులు చేనేత నాయకులు, సిల్క్ హౌస్ వారు గురువారం ఉదయం విజయవాడ ఆలయ సిల్క్స్ వద్ద తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమముతో పాటు పట్టణములో పురవీధులలో ర్యాలీని కూడా నిర్వహించి, జరిగిన సంఘటనను ప్రజలకు తెలియజేశారు. కొన్ని సంవత్సరాలుగా ధర్మవరం వ్యాపారస్తులు విజయవాడ వ్యాపారస్తులతో నమ్మకంతో వ్యాపారం చేస్తున్నామని, ఇచ్చిన చీరలకు డబ్బు అడిగితే బట్టలు విప్పి దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని? వారు ప్రశ్నించారు. చరిత్రలో ఎప్పుడూ లేని సంఘటన జరగడం చాలా దారుణమని, వ్యాపారస్తుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఉందని తెలిపారు. ఇటువంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని, వ్యాపారా నియమ నిబంధనల ప్రకారం తాము రాష్ట్రంలోని అన్ని నగరాలకు నమ్మకంతోనే చీరల వ్యాపారం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టి, చేనేత కార్మికులకు చేనేత వ్యాపారస్తులకు సరి అయిన భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం విజయవాడలోని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిన తర్వాత, ప్రభుత్వ ముఖ్య సలహాదారులైన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వినతిపత్రాన్ని అందజేసి, చేనేత వ్యాపారస్తులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం, మంగళగిరి, గుంటూరు, చీరాల, పెడనకు సంబంధించిన చేనేత వ్యాపారస్తులు దాదాపు 100 మంది పాల్గొన్నారు.