ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే. వి రమణ
విశాలాంధ్ర – ధర్మవరం:ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఈనెల 24న శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ ఆఫీస్ నందు ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే.వి. రమణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ తరహాలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి రైతుకు ప్రతి ఎకరంనకు పదివేల రూపాయలు సాగు సాయమందించాలని, కేరళ ప్రభుత్వ తరహాలో రుణ విముక్తి చట్టాన్ని తీసుకొని రావాలని, రైతుల పంపుసెట్లకు స్మార్ట్ మీటర్స్ బిగించరాదని, 50 సంవత్సరములు పూర్తి అయిన ప్రతి రైతుకు పదివేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రైతుల వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు ఏదో ఒకచోట రైతులు, మహిళా రైతులు అప్పుల భారం ఎక్కువై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఆత్మహత్యలు ఆపడానికి ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కోసం వేగవంతంగా చర్యలు చేపట్టాలని ,ముఖ్యంగా నీటి జలాలు సమృద్ధిగా ఉండే విధంగా ప్రతి చెరువుకు నీటిని నింపడానికి హంద్రీనీవా కాలవ మరమ్మతులు చేపట్టి,ప్రతి చెరువుకు అవసరమైన పిల్ల కాలువలను ఏర్పాటు చేసి, రైతుల బోర్లు ఎండిపోకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు.సాగులో ఉన్న ప్రతి రైతుకు సాగుపట్ట ఇవ్వాలని, తదితర సమస్యల పైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్క రైతు పాల్గొనాలని, ఆ విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
రైతుల ఆత్మహత్యల వలన వారి కుటుంబం దిక్కులేని పరిస్థితులలోకి వెళతాయని, రైతుల ఆత్మహత్యలను సమస్యలు పరిష్కారం కావని, రైతులు మనోధైర్యంతో ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తో కలసి రావాలని పిలుపునిచ్చారు.