ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చెంగల మహేష్
విశాలాంధ్ర- ఉరవకొండ : చేనేత పరిశ్రమను, కార్మికులను ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకోవాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ కార్యదర్శి చెంగల మహేష్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని సోమవారం ఉరవకొండలో దేవాంగ కళ్యాణమండపంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ లోని చేనేత కులాల వారు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ. సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమను, కార్మికులను కాపాడాలని చేనేత వస్త్రాల వాడకాన్ని పెంచాలని, కార్మికులకు ముడి సరుకు సబ్సిడీతో అందించాలని, సంక్షేమ పథకాలతో పాటు బ్యాంకు రుణాలు కూడా మంజూరు చేయాలని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలపై విధించిన జీఎస్టీని తక్షణమే ఎత్తివేయాలన్నారు. చేనేత వర్గాల వారు ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వాలు చేనేత వర్గాల వారికి కూడా అధిక ప్రాధాన్యత కల్పించాలన్నారు. చేనేత కులాల వారందరూ కూడా ఐక్యంగా వృత్తి సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందా రాము, తో పాటు చేనేత కుల పెద్దలు కాసుల శ్రీధర్, సుబ్రహ్మణ్యం, తిరువీధుల వెంకటేశులు, కృష్ణమూర్తి విశ్వనాథ్, ముక్కర బాలచంద్ర, చంగలి భోజరాజు, పెద్దకోట్ల రవి, శిరుమాళ్ళ కృష్ణమోహన్, పెద్దకోట్ల శ్రీనివాసులు, వేల్పుల శ్రీనివాసులు, సూర్య ప్రకాష్, కుల్లాయి బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది చేనేత వృద్ధ కార్మికులను ఘనంగా సన్మానించారు.