ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో నిరసన వ్యక్తం చేయడానికి వెళుతున్న సిపిఐ ఏఐఎస్ఎఫ్ నాయకులను మార్గమధ్యంలో అరెస్టు చేసిన పోలీసులు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి నారాయణస్వామి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉరవకొండ పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా జిల్లాలో రైతాంగాన్ని ఆదుకోవాలని విద్యార్థి యువజన సమస్యల పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేయడానికి వెళుతున్న సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య కుల్లాయి స్వామి నగర అధ్యక్షులు ఉమా మహేష్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ నాయకులు మంజు సిపిఐ నాయకులు సుందర్రాజులను మార్గమధ్యంలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి మాట్లాడుతూ జిల్లాలో రైతులు పంటల పండక, పండిన పంటలకు గట్టుబాటు ధరలు లేక ఈ విధంగా నష్టపోతున్నారన్నారు. జిల్లాలో గత కొన్ని రోజుల క్రితం కేంద్ర కరువు బృందం పర్యటన చేసి తూతూ మంత్రంగా అంచనా వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక పంపారన్నారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రైతన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జనవరి వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని అధికారంలోకి వచ్చి నాలుగ సంవత్సరాలు 9నెలలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారన్నారు. డిగ్రీ పై తరగతులు ఉన్నత చదువులు చదవడానికి గతంలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఒక విద్యార్థికి అందజేసేవారన్నారు కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే జీవో నెంబర్ 77 తీసుకొని వచ్చి పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేసే పద్ధతుల్లో తీసుకొని వచ్చారని మండిపడ్డారు. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉండాలని కొన్ని వేల ఎకరాలు భూమి కావాలని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు,కానీ మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానిలు అని మాట తప్పారన్నారు.తక్షణమే రాష్ట్ర రాజధాని అమరావతి లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. నేను అధికారంలోకి వస్తే 25కి 25 ఎంపీలు ఇవ్వండి మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన తీసుకువస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు అందరూ కలిసి ఎంపీలతో రాజ్యసభ సభ్యులతో కలిపి 31 ఎంపీలు ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వంతో ఇంతవరకు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను ప్రస్తావనకు తీసుకురాలేదన్నారు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను రాజీనామా చేయించి ప్రత్యేక హోదాపై పోరాటం చేశారని గుర్తుకు చేశారు,మరి అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా అంశాన్ని మరిచిపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో జిల్లాలో ఉన్న రైతులు విద్యార్థిలు యువజన సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్దామని కలవడానికి వెళ్తున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సరైనది కాదని తెలిపారు.తక్షణమే రైతులు విద్యార్థి యువజన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు..ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య కుల్లాయి స్వామి నగర అధ్యక్షులు ఉమా మహేష్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ నాయకులు మంజు సిపిఐ నాయకులు సుందర్రాజుల తదితరులు పాల్గొన్నారు