విశాలాంధ్ర- అనంతపురం : కడపులో పేగులు మెలితిరిగిపోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఓ బాలుడికి అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు సమయానికి శస్త్రచికిత్స చేసి, ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్. మహ్మద్ షాహిద్ తెలిపారు. “11 ఏళ్ల బాలుడు తరచు విపరీతమైన కడుపునొప్పి, తరచు వాంతులతో గత ఐదేళ్లుగా బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా ఇవి బాగా ఎక్కువయ్యాయి. ఇదే సమస్యతో పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం కనిపించలేదు. దాంతో వాళ్లు కిమ్స్ సవీరా ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్. మహ్మద్ షాహిద్ నేతృత్వంలో ముందు క్షుణ్ణంగా పరిశీలించారు. సీటీ స్కాన్ కూడా చేయడంతో.. పేగులు మెలితిరిగినట్లు తెలిసింది. వెంటనే బాబు తల్లిదండ్రులకు విషయాన్ని వివరించి, శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. ఇందుకు లాడ్స్ ప్రొసీజర్ అనే అత్యాధునిక విధానాన్ని అనుసరించాం. ఇలా చేయడం అనంతపురం జిల్లాలో ఇదే మొదటిసారి. ఆపరేషన్ తర్వాత బాబు పరిస్థితి మొత్తం బాగుపడింది. మొదటిరోజే ఆహారం తినిపించి, నడిపించి.. మూడోరోజు అన్నీ బాగుండటంతో డిశ్చార్జి చేయడం జరిగిందన్నారు.