-సభ అనంతరం వైసిపి ఎన్నికల ఊపు
- జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విశాలాంధ్ర-రాప్తాడు : రాజ్యసభలో టీడీపీకి ఒక ఎంపి లేకపోవడం ఆపార్టీకి పెద్ద దెబ్బ అని…సీఎం జగన్ సిద్దం సభ అనంతరం వైసిపిలో ఎన్నికల ఊపు కనిపిస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నేడు రాప్తాడులో జరగనున్న సిద్ధం సభ ఏర్పాట్లను శనివారం ఆయన సీఎం టూర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మంత్రి ఉషశ్రీచరణ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది ఎన్నికల సభగా నిర్వహిస్తున్నామని..వైసిపి శ్రేణులకు ఈ సభ మంచి సందేశాన్ని ఇస్తుందన్నారు.
అందుకే ప్రతిష్టాత్మంగా తీసుకుని ఈసభ విజయవంతా నికి కృషి చేస్తున్నామన్నారు.
రాబోయే ఎన్నికలకు పూర్తిగా వైసిపి శ్రేణులు సన్నద్ధం అవుతాయని.. రాష్ట్ర ప్రజలు వైసీపీ పట్ల ఆకర్షితులవుతారన్నారు. ఈ సభతో రాష్ట్రంలో మూడు సిద్దం సభలు పూర్తి అవుతాయని..త్వరలో పల్నాడులో మరో సభ నిర్వహిస్తామన్నారు. గత ఎన్నికల కంటే అత్యధిక స్థానాలు సాధించేందుకు ఈ సభ ఊతం ఇస్తుందని, ఉమ్మడి రాష్ట్రంలో అతి పెద్ద సభగా ఈ సిద్దం సభ నిలుస్తుందన్నారు.
ఈ సభజు ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల వైసీపీ శ్రేణులు హాజరవుతాయన్నారు. 2024 ఎన్నికల్లో 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామన్నారు.
దెందులూరు సభ చూస్తే కోస్తా ప్రాంతంలో వైసీపీ బలం తెలుస్తుందన్నారు. ప్రభుత్వ పనితీరే పార్టీ విజయానికి దోహదపడుతుందన్నారు. అమ్మఒడి, నాడు నేడు, ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో చెప్పుకునేందుకు అనేక పథకాలు సిఎం వైయస్ జగన్ మాకు అందించారని…చంద్రబాబుకు వారు మేము ఇది చేశామని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా ? అని ప్రశ్నించారు. ఏమి లేదు కాబట్టే వైసీపీని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారన్నారు. ఈ నెల 26 న సిఎం వైఎస్ జగన్ కుప్పం ప్రజలకు హంద్రీనీవా ద్వారా నీరు అందిస్తారని…14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఆ పని చేయలేక పోయారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఎప్పుడో వైసిపి లోకి మారిపోయాయని.. అక్కడ మిగిలిన వారు కేవలం చంద్రబాబు కోసం పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, చవ్వా రాజశేఖర్ రెడ్డి, ఎల్ఎం మోహన్ రెడ్డి, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మంజుల,
శింగనమల వీరాంజనేయులు, పామిడి వీరా, పెన్నోబిలేసు, బీసీ రమేష్, కృష్ణవేణి, శ్రీదేవి, రాప్తాడు కన్వీనర్ జూటూరు శేఖర్, చిట్రెడ్డి సత్తిరెడ్డి, మరూరు ఆది, చిట్రా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.