వరద నిర్వహణపై 72 గంటల్లోగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయా శాఖల అధికారులు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పిలుపునిచ్చారు. శనివారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నగరపాలక సంస్థ పరిధిలోని అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనంత నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన సహకారం అందిస్తామన్నారు. వరద నిర్వహణలో భాగంగా భారీ వర్షం వచ్చి ఎక్కువ నీరు వస్తే ఎక్కడ నుంచి ఎక్కడికి పోతుంది, ఎక్కడ ప్రభావితం అవుతుంది అనే దానిపై వచ్చే 72 గంటల్లోగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. నగరంలోని నడిమివంక, మరువవంకలు, డ్రైనేజీ వ్యవస్థపై నగరపాలక సంస్థ కమిషనర్ సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశంలో మున్సిపల్ ఆర్డి, ఎస్ఈ, టౌన్ ప్లానర్, డిపిఓ, తహసిల్దార్, తదితరులు పాల్గొనాలన్నారు. నడిమివంక, మరువవంకలు వెళ్లే ప్రాంతంపై పరిశీలించి, ఎక్కడ చెత్త ఉండేందుకు వీలు లేకుండా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా వంకలలో చెత్త తొలగించేందుకు పలుచోట్ల మట్టివేసి దారి ఏర్పాటు చేయాలన్నారు. నగరపాలక సంస్థ చుట్టూ ఉన్న పంచాయతీలతో సమన్వయం చేసుకొని అధికారులు పని చేయాలన్నారు. వంకల్లో ఎక్కడా నీరు బ్లాక్ కావడానికి వీలు లేకుండా చెత్త తొలగించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో కూడా డ్రైవ్ ద్వారా డ్రైనేజీలను పరిశీలన చేయాలన్నారు. ఆల్ ఇండియా రేడియోలో మున్సిపల్ కమిషనర్ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించాలని, ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు. వర్షాకాలం సీజన్ నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని, ఫాగింగ్ చేయించాలన్నారు. ఫాగింగ్ చేయడం చేపట్టారా లేదా అనేది శానిటేషన్ సెక్రటరీ ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని, ఈ విషయమై కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేయాలన్నారు. కీలకమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ ఐఈసి మెటీరియల్ ను ప్రదర్శించాలన్నారు. నీటి నిల్వ ఉన్నచోట ఆయిల్ బాల్స్ వేయడం, స్ప్రేయింగ్ చేయించాలని, జూలై, ఆగస్టు నుంచి మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇందుకోసం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో వీధి దీపాలు ఎక్కడైనా పని చేయకపోతే వాటిని పనిచేసేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం ఎమ్మెల్యేగా విజయం సాధించిన దగ్గుపాటి ప్రసాద్ కి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు.
నగరంలోని నడిమివంక, మరువవంక అక్రమణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. నగరంలోని నడిమివంక, మరువవంక వెళ్లే ప్రాంతాల్లో పలుచోట్ల ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయిందని, నగరంలో ఆ వంకలు మూడు కిలోమీటర్ల మేర వెళ్తుండగా, భారీ వర్షాలు వల్ల వరదలు వచ్చినప్పుడు వంకలు బ్లాక్ అయి నీరు పైకి వచ్చి కాలనీలలోకి చేరుతున్నాయన్నారు. ఆయా వంకలపై ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయని, వంకలపై నిర్మాణాలు కట్టారని, ఆక్రమణలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కావడంతో మున్సిపాలిటీల తరఫున ఒక లక్ష మొక్కలను నాటించాలని, వాటిని సంరక్షించాలన్నారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డీ పివిఎస్ఎన్ మూర్తి, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర, పబ్లిక్ హెల్త్ డిఎస్ఈ రామ్మోహన్ రెడ్డి, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ లింగమయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.