విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా .యుగంధర్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కార్యాలయంలో మిషన్ ఇంద్రధనస్సు (వ్యాధి నిరోధక టీకాలు) కార్యక్రమం గోడ ప్రతిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ఆగస్టు నెల నుంచి అక్టోబర్ నెల వరకు మూడు విడుదలుగా జిల్లాలో జరుగుతుందని పేర్కొన్నారు. వ్యాధి నిరోధక టీకాలు సకాలం లో వేయించని పిల్లలకు సంభందిత తల్లి తండ్రులు ఈ సంధర్భంగా వేయించాలని కోరారు. ఈ కార్యక్రమం ఆగస్టు నెలలో 7 తేదీ నుండీ 12వ తేదీ వరకు, సెప్టెంబర్ నెలలో 11వ తేదీ నుండీ 16వ తేదీ వరకు, మరియు అక్టోబర్ నెలలో 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని సామాజిక మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ అదే విధంగా గ్రామ సచివాలయాల్లో నూ అందుబాటులో వుంటుందన్నారు. ‘0’ నుంచి ఐదు సంవత్సరాలు లోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలను వైద్య సిబ్బంది చేత అందిస్తామని ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని చిన్నపిల్లల్లో వచ్చే ప్రాణాంతక వ్యాధులను నివారించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామ ఆశా కార్యకర్త సహాయంతో యూ -విన్ మొబైల్ అప్లికేషన్లో ముందస్తుగా నమోదు చేసుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. గర్భవతులకు అందించే టీకాలను కూడా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రోగ్రాం అధికారి డా.సుజాత డా. మహేంద్ర, మారుతి ప్రసాద్, సుబ్రహ్మణ్యం, శ్యామ్యూల్ పాల్గొన్నారు.