జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : తాడిపత్రికి చెందిన స్వామి రమణ మహర్షి అనాధాశ్రమ విద్యార్థులు చేపట్టిన రోడ్ స్కేటింగ్ కోసం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలోని తాడిపత్రి పట్టణానికి చెందిన స్వామి రమణ మహర్షి అనాధాశ్రమంలో చదివే విద్యార్థులు జిల్లా కలెక్టర్ ని కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనాధాశ్రమ విద్యార్థులు జిల్లాలో 750 కిలోమీటర్ల పాటు రోడ్ స్కేటింగ్ చేయనుండడం ఎంత గొప్ప విషయమన్నారు. రోడ్ స్కేటింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా తాడిపత్రి రమణ మహర్షి అనాధాశ్రమం సెక్రటరీ రమణ మహేష్, స్కేటింగ్ కోచ్ బి.మధు మాట్లాడుతూ రమణ మహర్షి అనాధాశ్రమం విద్యార్థులు 7 మంది జిల్లాలో ఆగకుండా 750 కిలోమీటర్లు రోడ్ స్కేటింగ్ ను ఈనెల 12వ తేదీన ఉదయం 5 గంటలకు తాడిపత్రిలో మొదలు పెట్టడం జరుగుతుందన్నారు. తాడిపత్రి నుంచి గుత్తి, గుంతకల్, ఉరవకొండ, అనంతపురం, లేపాక్షి, హిందూపురం, మడకశిర, ధర్మవరం మీదుగా తిరిగి తాడిపత్రికి రోడ్ స్కేటింగ్ చేరుకుంటుందన్నారు. “ఆడపిల్లలను చదివిద్దాం – ఆడపిల్లలను రక్షిద్దాం”, “ప్లాస్టిక్ కవర్లను నిషేధిద్దాం – భూగర్భ జలాలను కాపాడుకుందాం”, “అనాధలను ఆదరిద్దాం – బాల కార్మికులను నిరోధిద్దాం” అనే నినాదాలతో రోడ్ స్కేటింగ్ చేపడుతున్నామన్నారు. దీని ద్వారా వజ్ర వరల్డ్ రికార్డ్, హిందుస్థాన్ రికార్డు, ఏషియన్ కాంటినెటల్ రికార్డ్, వజ్ర నేషనల్ రికార్డులను నెలకొల్పాలని స్కేటింగ్ చేస్తున్నామని తెలిపారు. రోడ్ స్కేటింగ్ కు జిల్లా కలెక్టర్ సహాయ సహకారాలు అందించడం పట్ల వారి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్కేటింగ్ సౌత్ జోన్ సెక్రటరీ బి.ప్రతాప్, విద్యార్థులు ఇషాక్, యోగేంద్ర, పృథ్వీ, రామ్ చరణ్, భార్గవ, శ్రీరామ్, తరుణ్, తదితరులు పాల్గొన్నారు.