హైదరాబాద్ : అద్బుతమైన ప్రకృతి అందాలకు పెట్టింది పేరు గుజరాత్ రాష్ట్రం. విశాలమైన తీర ప్రాంతం కలిగిన ఈ రాష్ట్రంలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందుకే గుజరాత్ ప్రభుత్వం పర్యాటకానికి పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా గుజరాత్ పర్యాటక శాఖ ఎన్నో ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి చేస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్త పర్యాటకుల కోసం గుజరాత్ ప్రభుత్వం సీమ దర్శన్ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుజరాత్లోని నాడాబెట్ వద్ద ఉన్న జీరో పాటింట్ని అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేసింది. దీనివల్ల దేశప్రజలు సరిహద్దు టూరిజం గురించి తెలుసుకోగలుగుతారు. నాడాబెట్లో భారత్-పాక్ సరిహద్దులో బిఎస్ఎఫ్ జవాన్లు నిరంతరం గస్తీ కాస్తుంటారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా ఆ జవాన్ల జీవన శైలిని మనం చాలా దగ్గరనుంచి గమనించవచ్చు. నాడాబెట్లో పరేడ్ గ్రౌండ్, ఎగ్జిబిషన్ సెంటర్, ఆడిటోరియం, లైటింగ్, సోలార్ ట్రీస్, సెల్ఫీ పాయింట్స్ వంటి ప్రదేశాలు ప్రత్యేక ఆకర్షణ. చిన్నారుల కోసం కిడ్స్ అండ్ గేమింగ్ జోన్ని కూడా నిర్మించారు. వీర సైనికుల జ్ఞాపకార్థం ‘అజయ్ ప్రహరి’ అనే స్మారక చిహ్నాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. 30 అడుగుల ఎత్తైన టి-జంక్షన్, వాల్ పెయింటింగ్స్తో అందంగా అలంకరించబడి ఉంటుంది. ఇది సీమ దర్శన్ కాంప్లెక్స్కు కేంద్ర బిందువుగా ఉంటుంది. స్వదేశ్ దర్శన్ పథకం కింద గుజరాత్ పర్యాటక శాఖ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసింది.