కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిరది. ప్రధానిగా నరేంద్రమోదీ మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఆదివారం సాయంత్రం పూర్తిఅయింది. 71 మంది మంత్రులతో కొత్త కేబినెట్ కొలువుదీరింది. ఇందులో 30మందికి కేబినెట్ హోదా, ఐదుగురికి స్వతంత్రంగా వ్యవహారించగలిగే సహాయ మంత్రుల హోదా, మిగిలిన 36 మందికి సహాయ మంత్రుల హోదా దక్కింది. కేంద్రమంత్రి వర్గంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించారు. ఐదుగురు తెలుగువారికి కేబినెట్లో చోటు లభించింది. ఐదేళ్ల విరామం తరువాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా మంత్రిమండలిలో చోటు కల్పించారు. యువత, అనుభవజ్ఞుల కలబోతగా కొత్త మంత్రివర్గం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయితే, మంత్రివర్గం ఏర్పడి 24 గంటలు గడవలేదు. కొత్త మంత్రులు, మిత్రపక్షాలలో అసమ్మతి రాజుకోవడం మొదలైంది. ఐదు మిత్రపక్షాలకు మోదీ కేబినెట్లో ఒక్కొక్క మంత్రి పదవినే కేటాయించారు. పదవీవిరమణ చేసిన మంత్రివర్గంలో పనిచేసిన చాలా మందికి కొత్త మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, అజయ్ మిశ్రా, నారాయణ రాణే, మీనాక్షి లేఖి, అజయ్ భట్ సహా దాదాపు 37 మంది కమలం పార్టీ నేతలకు ఈ సారి అవకాశం కల్పించలేదు. వీరిలో కొంతమంది ఎన్నికల్లో ఓడిపోగా, మరికొంత మంది పోటీచేయలేదు. అజయ్ భట్, అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణే వంటి వారు ఎన్నికల్లో గెలిచినప్పటికీ, వారికి మంత్రివర్గంలో మరోసారి అవకాశం కల్పించకపోవడం గమనార్హం. గత ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా చేసిన స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్ జ్యోతి, ఆర్కే సింగ్, అర్జున్ ముండా, రాజీవ్ చంద్రశేఖర్, నితీశ్ ప్రామాణిక్, అజయ్ మిశ్రా, సుభాష్ సర్కార్, భారతి పవార్, కపిల్ పాటిల్ ఎన్నికల్లో ఓడిపోయారు. మంత్రి పదవులు లభించిన చాలా మందిలో కూడా అసంతృప్తి నెలకొంది. సహాయ మంత్రి పదవి కేటాయించారని కొందరు, తమ పార్టీకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కొన్ని మిత్రపక్షాలు ఇప్పటికే అసమ్మతి రాగాన్ని అందుకున్నాయి. కేరళలో కాషాయపార్టీకి చరిత్రాత్మక విజయం సాధించిన సురేశ్ గోపి తనకు సహాయ మంత్రి పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారం చేసి ఒక్క రోజు కూడా గడవలేదు. అప్పుడే ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సోమవారం సాయంత్రం వరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. సగంలో ఉన్న సినిమా షూటింగ్లను పూర్తి చేసేందుకు మంత్రి పదవి నుంచి వైదొలగాలని సురేశ్ గోపి భావిస్తున్నట్లు ఓ మలయాళీ మీడియా కథనం. కంద్ర మంత్రి పదవి నుంచి నన్ను తప్పిస్తారని భావిస్తున్నానని, సినిమాలను పూర్తి చేయాల్సి ఉందని, ఈ అంశంపై కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని, ఒక ఎంపీగా తాను త్రిస్సూరులో మెరుగైన సేవలు అందిస్తానని, తనకు మంత్రి పదవి అవసరం లేదని సురేశ్ గోపి తెలిపారు. సినిమాల కోసం కేంద్ర మంత్రి పదవిని త్యాగం చేయడం మూర్ఖత్వం అవుతుందని కొందరు సురేశ్ గోపికి చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అయితే, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని జరుగుతున్న ప్రచారాన్ని సురేశ్ గోపి సోమవారం సాయంత్రం కొట్టిపారేశారు. అదంతా ఉత్త ప్రచారమేనని తోసిపుచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో కేరళను అభివృద్ధి చేయాలని తాము నిర్ణయించుకున్నానని తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ మంత్రి పదవి రాకపోవడంతో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్లో నిర్వేదం ఏర్పడి ప్రజా జీవితానికి దూరమవుతున్నానని ప్రకటించారు. మంత్రి పదవి రాకపోవడంపై ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. తన 18 ఏళ్ల్ల ప్రజా జీవితాన్ని ముగిస్తున్నట్లు ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. పార్టీ కోసం నాయకుడిగా కొనసాగుతానని సుద్దులు పలికారు. కేంద్ర మంత్రిగా రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి పోటీ చేశారు. అక్కడి నుంచి మూడు సార్లు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నేత శశి థరూర్ చేతిలో 16,077 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ఎన్సీపీ (అజిత్పవార్) వర్గానికి కూడా మోదీ షాకిచ్చారు. కేబినెట్ హోదా కలిగిన కేంద్రమంత్రి పదవి ఇవ్వాలన్న ఆ పార్టీ డిమాండ్ను తోసిపుచ్చి కేవలం సహాయ మంత్రి పదవి మాత్రమే ఇస్తామన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించకపోవడంతో అజిత్ పవార్ సేవలకు బీజేపీ ముగింపు పలికినట్లేనంటూ చర్చ సాగుతోంది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగు లోక్సభ స్థానాల్లో పోటీచేస్తే సునీల్ తట్కరే మాత్రమే గెలిచారు. అజిత్ పవార్ ఎక్కువమంది ఎమ్మెల్యేలతో పార్టీని చీల్చి ఎన్డీయేకు మద్దతు ఇచ్చినా ఓటు బ్యాంకు మాత్రం అజిత్తో రాకపోవడంతో మరో కొద్ది నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర రాజకీయాల విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కేబినెట్లో ఎన్సీపీ మినహా ఎన్డీయేలోని అన్ని భాగస్వామ్య పక్షాలు చోటు సంపాదించడం, ఒక సీటు గెలుచుకున్న జితన్ రామ్ మాంరీa కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేయడంపై అజిత్ పవార్ అసంతృప్తితో ఉన్నారు. తమ పార్టీకి చెందిన ప్రఫుల్ పటేల్ గతంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారనీ, అందువల్ల సహాయ మంత్రి బాధ్యతలు తీసుకోవడం సరైనది కాదని అజిత్ పవార్ స్పష్టం చేశారు. బీజేపీ ఒకో పార్టీ పట్ల ఒకోరకంగా వ్యవహారిస్తోందని అజిత్ పవార్ ఆగ్రహంగా ఉన్నారు. ఒక సీటు గెలుచుకున్న హెచ్ఏఎంకు కేబినెట్ ర్యాంకు పదవి ఇచ్చి తమకు సహాయ మంత్రి పదవి ఇవ్వజూపడం ద్వారా బీజేపీ సమన్యాయం పాటించడంలేదని ఆయన గుర్రుగా ఉన్నారు. మహారాష్ట్రలో రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు అజిత్ పవార్ను బీజేపీ తన వెంట తెచ్చుకుంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో కాషాయపార్టీ వ్యూహం ఫలించలేదు. అజిత్ పవార్ పార్టీ పోటీ చేసిన నాలుగు సీట్లలో ఒకదానిని మాత్రమే గెలుచుకుని 3.6 శాతం ఓట్లు సాధించింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్తో పొత్తుపెట్టుకుని పోటీచేసిన 10 సీట్లలో ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. దీంతో ప్రజలు అసలైన ఎన్సీపీ అధినేతగా శరద్ పవార్నే గుర్తించారని స్పష్టమైంది. హర్యానాలో పది లోక్సభ నియోజకవర్గాలుండగా బీజేపీ ఐదింటిలో మాత్రమే విజయం సాధించినా వీరిలో ముగ్గురికి కేబినెట్లో స్థానం కల్పించడం ద్వారా మోదీ హర్యానాకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అక్టోబర్ నెలఖారులోపు హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించవచ్చు. దీంతో హర్యానాపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. దేశ రాజధాని దిల్లీకి సమీపంలో ఉన్న హర్యానాలో ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. మరోసారి గెలవాలని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఒకవేళ హర్యానాలో ఓడిపోతే ఆ ప్రభావం కేంద్రప్రభుత్వంపై పడే అవకాశం ఉంటుంది. అందుకే హర్యానాలో గెలుపును కమలనాధులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఇది బీజేపీకి కలిసొస్తుందా లేదా అనేది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.