పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అధికారానికి దూరంగా ఉండాలంటే కష్టమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, రాష్ట్ర విభజన తరవాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయడుకు గత అయిదేళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉండాల్సి రావడంతో తల్లడిల్లి పోయారు. శాసనసభలో తన భార్య భువనేశ్వరిని అవమానపరిచారని, అలాంటి శాసన సభలో ముఖ్యమంత్రిగా తప్ప అడుగు పెట్టనని ప్రతిజ్ఞచేసి దాదాపు మూడేళ్లయిన తరవాత శాసనసభ ఎన్నికల్లో తన పాత ప్రత్యర్థిని ఓడిరచారు. 175 ా్థనాలున్న ఆంధ్రప్రదేశ శాసనసభలో 135 సీట్లు సంపాదించారు. తెలుగుదేశానికి మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జన సేనతో చంద్రబాబునాయుడు పొత్తు పెట్టుకున్నారు. జనసేన పార్టీ ఏర్పడి పదేళ్లయింది. కానీ ఈసారి మాత్రం పోటీ చేసిన 21స్థానాల్లోనూ గెలిచింది. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోవడానికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి విజయం సాధించడానికి నిర్దిష్టమైన కారణం చూపడం కష్టమే. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సైతం మిగతా అన్ని పక్షాలలాగే సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలుచేసినా జనం ఆయన పార్టీని సాగనంపారు. పరిపాలనలో లోపాలు, ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించిన తీరు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడును నైపుణ్యాభివృద్ధి పథకంలో అవకతవకల పేరుతో అరెస్టు చేయడంవల్ల పెద్దగా సానుభూతి లభించిన దాఖలాలూ కనిపించలేదు. కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ఊహించని రీతిలో అపూర్వమైన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన, బీజేపీని కలిపి చంద్రబాబు నాయుడు ఏర్పాటుచేసిన కూటమివల్ల మంచి ప్రయోజనమే కలిగింది. విచిత్రం ఏమిటంటే దేశ వ్యాప్తంగా మోదీ నాయకత్వంలోని బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మెజారిటీ సాధించలేక పోయింది. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీకి చెప్పుకోదగ్గ బలమూ లేదు. అయినా బీజేపీ ఎనిమిది శాసన సభా స్థానాలు, మూడు లోకసభా స్థానాలు సాధించడం విచిత్రమే. తెలుగు దేశం, జన సేన, బీజేపీ బలం ఆధారంగా కాకుండా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పేరుకుపోయిన అసంతృప్తే కూటమిని గెలిపించినట్టు కనిపిస్తోంది. వచ్చే తొమ్మిదో తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి కావడం ఇది నాల్గో సారి.
అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు అమలుచేసినా ప్రజలు కృతజ్ఞతా భావంతో మరోసారి గెలిపిస్తారనే భరోసా లేదు. ఎందుకంటే దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాల అమలు మీద శ్రద్ధ చూపుతున్నాయి తప్ప ఉపాధి, ఉత్పత్తి పెంచే విధానాలను బొత్తిగా పట్టించుకోవడం లేదు. ప్రజలకు కల్పించే సదుపాయాలే తమను గట్టెక్కిస్తాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 1983లో ఎన్టీ రామారావు మొదటిసారి అధికారంలోకి వచ్చిన రోజుల్లో అయితే రెండు రూపాయలకు కిలో బియ్యం లాంటి సంక్షేమ పథకాలవల్ల ఓట్లు రాలి ఉండవచ్చు. ఆ తరవాత సంక్షేమ పథకాలు అమలు చేయని ప్రభుత్వమే కనిపించదు. కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరూ అడక్కుండానే రూపాయికి కిలో బియ్యం పథకం అమలు చేశారు. కానీ ఆ తరవాతి ఎన్నికలలో ఆయనను పట్టించుకున్న వారేలేరు. ఆ తరవాత ఆయన రాజకీయాలనుంచే మాయమయ్యారు. పోటీలుపడి సంక్షేమ పథకాలు ప్రకటించడంవల్ల అంతగా ప్రయోజనం ఉండదని ఇటీవలి ఎన్నికలలో అనుభవంలోకి వస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి విజయం సాధించడం ఒక్కటే మహత్తరమైన అంశం కాదు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన మెజారిటీ రాకపోవడం చంద్రబాబుకు జాతీయ రాజకీయాల్లో అనుకూలించే అంశం. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జె.డి.(యు), తెలుగుదేశం మద్దతు లేకపోతే మోదీ ప్రభుత్వం పదిలంగా నడిచే అవకాశం లేదు. మోదీ నాయకత్వంలో బీజేపీ బలం గణనీయంగా తగ్గడంవల్ల చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో మరోసారి చక్రంతిప్పే అవకాశం వచ్చింది. గతంలో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పాటు చేయవలసి వచ్చినప్పుడు దేవగౌడ ప్రధానమంత్రి కావడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. దేవగౌడ ప్రభుత్వం ఏడాదికాలం కూడా మనలేకపోయింది. ఆ తరవాత ఐ.కె.గుజ్రాల్ ప్రధాని కావడంలో, అదే సమయంలో ఎ.పి.జె. అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడంలోనూ చంద్రబాబు పావులు కదిపే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ఘనవిజయం సాధించిన దశలో కూడా ఆయనకు మళ్లీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చింది. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ గతంలోనూ బీజేపీతో కలిసి కేంద్రంలో అధికారంలో భాగస్వామి అయింది. తెలుగు దేశం నాయకుడు జి.ఎం.సి. బాలయోగికి లోకసభ స్పీకర్ అయ్యే అవకాశమూ దక్కింది. ఒకప్పుడు కేంద్రంలో ‘‘కింగ్ మేకర్’’ పాత్ర పోషించిన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే పాత్ర పోషించగలిగిన పరిస్థితుల్లోనే విజయం సాధించారు. అయిదేళ్ల కింద అధికారం కోల్పోయిన తరవాత రాజకీయాల్లో తాను, తన నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ క్రియాశీలంగా కనిపించడానికి చాలా ప్రయాసపడ్డారు. కానీ ఫలితం కనిపించలేదు. ఏ అంశం ఆధారంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలో తేల్చుకోలేక పోయారు. పైగ తెలుగు దేశం లాంటి పార్టీలు ఉద్యమ నేపథ్యం నుంచి పరిణామ క్రమంలో వచ్చినవి కావు. నిజానికి తెలుగు దేశం పార్టీ, జన సన కూడా కేవలం ప్రాంతీయ పార్టీలే. పేరులో మాత్రమే జాతీయ పార్టీ అంటున్నారు అనడం కన్నా అనుకుంటారు అనడమే సబబుగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతీయ పార్టీలకు ప్రాంతీయ ప్రయోజనాలు తప్ప నిర్దిష్ట రాజకీయ భావజాలం, సిద్ధాంతం లాంటివి ఏమీ ఉండవు. తాము సెక్యులర్ వాదులమని చెప్పుకోవడం, అని చెప్పుకునే తత్వం అన్ని ప్రాంతీయ పార్టీలలోనూ కనిపిస్తుంది. ఒక్క లాలూప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్.జె.డి.) మినహా ప్రాంతీయంగా మాత్రమే బలంగా ఉన్న పార్టీలన్నీ ఏదో ఒక దశలో బీజేపీతో అంటకాగినవే. ఆధికారం కోసం, అస్తిత్వం కోసం సెక్యులర్ విధానాలను అటకెక్కించినవే. ఈ దశలో బాబు నాయకత్వంలోని కూటమి విజయం సెక్యులరిజాన్ని పదిల పరిచడానికి చేసేది ఏమీ ఉండదు. కేంద్రంలో మోదీకి మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కోరికల జాబితా సుదీర్ఘంగానే ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా మళ్లీ తెరమీదకు రావడం ఖాయం. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ హోదా కల్పించడం కష్టమే. అమరావతిలో రాజధాని నిర్మాణం వంటి బాబు ఆత్మకు ఇంపైన అంశాలు ఏమవుతాయో చూడాల్సిందే.